Type Here to Get Search Results !

May-17

May-17 Current affairs articles

‘ఆవశ్యక వ్యాధి నిర్ధారణ పరీక్షల జాబితా’ విడుదల
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలిసారిగా ‘ఆవశ్యక వ్యాధి నిర్ధారణ పరీక్షల జాబితా’ను విడుదల చేసింది. తరచుగా కనిపించే ఆరోగ్య సమస్యలు, కొన్ని ముఖ్యమైన వ్యాధులను త్వరగా గుర్తించే విధంగా ఈ జాబితాను రూపొందించింది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రజలకు సరైన చికిత్సలు అందట్లేదని WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అడ్హానమ్‌ అన్నారు. ప్రభావవంతమైన చికిత్సను అందించే ప్రక్రియలో తొలి అడుగు వ్యాధిని సరిగ్గా గుర్తించడమేనని.. సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు లేక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
  • ప్రపంచవ్యాప్తంగా టైప్‌-2 మధుమేహ బాధితుల్లో 46% మంది ఆ వ్యాధి తమకు ఉన్నట్లు గుర్తించలేదని WHO నివేదిక పేర్కొంది. హెచ్‌ఐవీ, క్షయ వంటి వాటిని కూడా త్వరగా గుర్తించకపోతే.. మరింత మందికి అవి వ్యాపించే ముప్పు ఉందని తెలిపింది.
  • తాజాగా ప్రచురించిన ఆవశ్యక వ్యాధి నిర్ధారణ పరీక్షాల జాబితాలో రక్తపరీక్ష, మూత్రపరీక్షతో పాటు మరో 58 పరీక్షలను WHO పేర్కొంది. హెచ్‌ఐవీ, క్షయ, మలేరియా తదితర వ్యాధులను గుర్తించే పరీక్షలు ఇందులో ఉన్నాయి. వనరులు పెద్దగా లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ నిర్వహించగలిగే పరీక్షలనూ ఈ జాబితాలో WHO పేర్కొంది.
  • WHO ప్రధాన కార్యాలయం - జెనీవీ, స్విట్జర్లాండ్‌
  • WHO ఏర్పాటు - 1948 ఏప్రిల్‌ 7
  • WHO డైరెక్టర్‌ జనరల్‌ - టెడ్రాస్‌ అడ్హానమ్‌
WHO-World Health Organization 
-------------------------------------------------------------------------------------------
22సార్లు ఎవరెస్టు అధిరోహణతో కామి రీత షెర్పా ప్రపంచ రికార్డు 
Event-Date:17-May-2018
Level:National
Topic:Persons in News
ఎవరెస్టు శిఖరాన్ని 22 సార్లు అధిరోహించి నేపాల్‌కు చెందిన కామి రీత షెర్పా(48) ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆగ్నేయ మార్గంలో అధిరోహించి ఈ పర్వత శిఖరాన్ని 2018 మే 16న చేరుకున్నారు. 1994లో 24 ఏళ్ల వయసులో తొలిసారిగా షెర్పాగా బాధ్యతలు నిర్వర్తించి ఎవరెస్టును అధిరోహించారు. 2016లో ఒకసారి చైనా వైపు నుంచి వెళ్లారు. 21సార్లు ఈ పర్వతారోహణ చేసిన వారిలో ఆపా షెర్పా, పుర్బా తషి షెర్పాలు ఉన్నారు.
  • ఎవరెస్టు శిఖరం ఎత్తు - 8,848 మీటర్లు
దేశంలో స్త్రీలపై లైంగిక హింస పెరుగుతూనే ఉంది : ‘గట్‌మషెర్‌-లాన్సెట్‌ కమిషన్‌’ నివేదిక 
జీవిత భాగస్వాముల నుంచి లైంగిక, శారీరక హింసను ఎదుర్కొనే మహిళల సంఖ్య పెరుగుతోంది. నేపాల్‌తో పోలిస్తే...భారత్‌, బంగ్లాదేశ్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలు ఈ తరహా హింసను ఎదుర్కొంటున్న 13 ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది.
  • బంగ్లాదేశ్‌లో ఇలా మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నట్లు ‘గట్‌మషెర్‌-లాన్సెట్‌ కమిషన్‌’ నివేదిక వెల్లడించింది. ఈ తరహా సంఘటనలు ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య సింగపూర్‌లో అత్యల్పమని పేర్కొంది.
  • శారీరక, లైంగిక హింసతో పాటూ పరువు హత్యలు, బాల్య వివాహాలు, లింగనిర్ధారణ అనంతరం భ్రూణ హత్యలు, లైంగిక వేధింపులు వంటివన్నీ  మహిళల  పాలిట శాపాలైనాయన్నది ఈ నివేదిక సారాంశంగా ఉంది.


మధ్యప్రదేశ్‌ పాఠశాలల్లో ‘యస్‌ సార్‌’, ‘యస్‌ మేడం’ మాటకు బదులు ‘జై హింద్‌’

పాఠశాలల్లో టీచర్లు హాజరు పిలిచేటప్పుడు ‘యస్‌ సార్‌’, ‘యస్‌ మేడం’ అనే మాటకు బదులు ‘జైహింద్‌’ అని మాత్రమే చెప్పాలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. బడి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు హాజరు పిలిచేటప్పుడు విద్యార్థులు ‘జైహింద్‌’ చెప్పాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 
  • మధ్యప్రదేశ్‌ రాజధాని - భోపాల్‌
  • మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి - శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (బీజేపీ)
  • మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ - ఆనందిబెన్‌ పటేల్‌
రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యంపెంచేందుకు జపాన్‌ చట్టం
రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు జపాన్‌ పార్లమెంటు ఒక చట్టం చేసింది. జాతీయ, స్థానిక ఎన్నికల్లో పురుషులకు, మహిళలకు సాధ్యమైనంత సమాన అవకాశాలు కల్పించేలా రాజకీయ పార్టీలను ఈ చట్టం ప్రోత్సహిస్తుంది. లక్ష్యాలను చేరుకున్న పార్టీలకు ప్రోత్సాహకాలు గానీ, చేరని పార్టీలకు శిక్షలుగానీ ఏమీ ఉండవు. దీంతో ఈ చట్టానికి పార్టీలు కట్టుబడి ఉండాల్సిన అవసరమేమీ లేదు. పార్టీలు స్వచ్ఛందంగా చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లో మహిళ ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉన్న దేశాల్లో జపాన్‌ కూడా ఒకటి.
  • జపాన్‌ రాజధాని - టోక్యో
  • జపాన్‌ ప్రధాని - షింజో అబే
గోల్కొండ నీలి వజ్రానికి రూ.45 కోట్లు 
మన దేశంలోని గోల్కొండ గనుల్లో బయటపడి ఐరోపా రాజవంశీయుల చేతుల్లోకి వెళ్లిన అరుదైన నీలి వజ్రం ‘ఫార్నెస్‌ బ్లూ’ వేలంలో భారీ ధర పలికింది. 6.16 క్యారట్ల స్వచ్ఛమైన ఈ వజ్రం బేరీపండు ఆకారంలో ఉంటుంది. సోథిబే సంస్థ 2018 మే 16న లండన్‌లో ఈ వజ్రాన్ని వేలం వేయగా గుర్తుతెలియని ఔత్సాహికుడు దాదాపు రూ.45 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నారు.
  • ‘ఫార్నెస్‌ బ్లూ’ ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాల్లోని పలు రాజ కుటుంబీకుల చేతులు మారింది.
  • స్పెయిన్‌ రాజు ఫిలిప్‌-5 రెండో భార్య ఎలిసబెత్‌ ఫార్నెస్‌ పేరు మీదుగా దానికి ఆ పేరొచ్చింది. పెళ్లి కానుకగా 1715లో ఎలిజబెత్‌ ఈ వజ్రాన్ని అందుకున్నారు.
వృద్ధుల బ్యాంకు లావాదేవీలకు ప్రత్యామ్నాయ గుర్తింపు విధానాలు
Event-Date:17-May-2018
Level:National
Topic:Economic issues
బ్యాంకు లావాదేవీల సమయంలో గుర్తింపు ధ్రువీకరణకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, ఆరోగ్యం బాగోలేని వారితో పాటు గాయాల పాలైనవారికీ ఉపశమనం కల్పించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఆధార్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ గుర్తింపు విధానాలనూ అనుమతిస్తామని 2018 మే 16న వెల్లడించింది. బయోమెట్రిక్‌ విధానంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొన్ని వర్గాల కోసం అక్రమ నగదు చెలామణీ చట్టం నిబంధనలను సరళీకరించింది. వయసు పైబడటం, అనారోగ్యం పాలుకావడం, గాయాల వల్ల బయోమెట్రిక్‌ విధానంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి తగిన మినహాయింపు ఇస్తారు.  
మలేషియా సంస్కరణవాది అన్వర్‌ జైలు నుంచి విడుదల
Event-Date:17-May-2018
Level:International
Topic:Persons in News
మలేషియాకు చెందిన సంస్కరణవాది అన్వర్‌ ఇబ్రహీం(70) 2018 మే 16న జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2015లో ఆయనకు శిక్ష విధించారు. 2018 జూన్‌ 8 నాటికి శిక్ష పూర్తి కావాల్సి ఉండగా, క్షమాభిక్ష లభించడంతో ముందుగానే విడుదలయ్యారు. ఆయనపై కేసు పెట్టిన వ్యవహారం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓ అంశంగా మారింది. 
లంచం పుచ్చుకున్న సౌదీ రిఫరీ ఫాహద్‌ అల్‌-మిర్దాసి సస్పెన్షన్‌
Event-Date:17-May-2018
Level:International
Topic:Sports and Games
2018 జూన్‌లో ఆరంభమయ్యే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విధులు నిర్వర్తించాల్సిన సౌదీ అరేబియా రిఫరీ ఫాహద్‌ అల్‌-మిర్దాసిపై ఆ దేశ ఫుట్‌బాల్‌ సమాఖ్య వేటు వేసింది. అతడిని ప్రపంచకప్‌ రిఫరీ బృందం నుంచి తప్పించాలని ఫిఫాకు విజ్ఞప్తి చేసింది. సౌదీలో ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు లంచం  ఇవ్వజూపగా ఫాహద్‌ అంగీకరించినట్లు విచారణలో తేలింది. దీంతో అతడిని వెంటనే సస్పెండ్‌ చేశారు. సౌదీలో అగ్రశ్రేణి రిఫరీగా పేరున్న 32 ఏళ్ల ఫాహద్‌ 2016 రియో ఒలింపిక్స్‌తో పాటు 2017లో రష్యాలో జరిగిన కాన్ఫెడరేషన్స్‌ కప్‌లోనూ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇందులో అతడి పనితీరు బాగుండటంతో ఫిఫా ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. 
2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా డిల్లీ 
Event-Date:17-May-2018
Level:International
Topic:Places in News
2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా భారత రాజధాని డిల్లీ అవతరించనుందని ఐక్యరాజ్య సమితి అంచనా నివేదిక  వెల్లడించింది. 2018 మే 16న ఈ నివేదికను విడుదల చేశారు. 
నివేదికలోని అంశాలు

  • 2050 నాటికి ప్రపంచ జనాభాలోని 68 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకుంటారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 55 శాతం మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. 
  • 2018-2050 ప్రపంచ పట్టణ జనాభా పెరుగుదల అంచనాల్లో 35 శాతం భారత్‌, చైనా, నైజీరియా వాటాగా ఉండబోతుంది
  • 37 మిలియన్ల నివాసితులతో టోక్యో ప్రపంచంలోనే అత్యంత పెద్ద నగరంగా అవతరించింది. 29 మిలియన్ల నివాసితుతో డిల్లీ ఆ తరువాతి స్థానంలో నిలిచింది. 20 మిలియన్ల ప్రజలతో ముంబయి, బీజింగ్‌, ఢాకా, కైరోలు కొనసాగుతున్నాయి. 
  • 2020 నాటికల్లా టోక్యోలో జనాభా పెరుగుదల తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయాన్ని ఈ నివేదిక వ్యక్తం చేసింది. డిల్లీలో మాత్రం జనాభా పెరుగుదల కొనసాగుతూనే ఉంటుంది. చివరకు 2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా అవతరించబోతుంది. అప్పటికి డిల్లీ జనాభా 37.2 మిలియన్లుగా ఉండవచ్చని అంచనా.
  • ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 10 మిలియన్లకు పైగా జనాభా కలిగిన 43 మెగా నగరాలు తయారవుతాయి. వాస్తవానికి 1950లో 751 మిలియన్లుగా ఉన్న ప్రపంచ పట్టణ జనాభా శరవేగంతో పెరిగింది. 2018 నాటికి 4.2 బిలియన్లకు చేరుకుంది.
  • ఇటీవలి సంవత్సరాల్లో కొన్ని నగరాల్లో జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నగరాలన్నీ కూడా ఆసియా, ఐరోపాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కొన్ని నగరాల్లో జనాభా తగ్గుదలకు అక్కడి ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం కావడం, ప్రకృతి విలయతాండవం చేయడం వంటివి కారణమౌతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. 
  • ప్రపంచంలో గ్రామీణ జనాభా 1950 నుంచీ మెల్లగా తగ్గుతూ వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తగ్గుదల చాలా మందకొడిగా ఉంది. గ్రామీణ ప్రజల విషయానికి వస్తే భారత్‌లోనే అత్యధిక రైతుల జనాభా(893 మిలియన్లు) ఉంది.
తెలంగాణలో కొత్తగా 2 మెడికల్‌ కాలేజిలు

తెలంగాణలో రెండు కొత్త మెడికల్‌ కాలేజిలకు కేంద్ర ప్రభుత్వం 2018 మే 16న అనుమతించింది. సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 సీట్లు, రంగారెడ్డి జిల్లాలో అయాన్‌ వైద్య కళాశాలకు 150 సీట్ల చొప్పున 2018-19 సంవత్సరానికి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండింటికీ అనుమతులివ్వాల్సిందిగా భారతీయ వైద్య మండలి(MCI) కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు సిఫార్సు చేయగా కేంద్రం అనుమతించింది. 
MCI-Medical Council of India 
ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు డిజిటల్‌ లీడర్‌ పురస్కారం 
Event-Date:17-May-2018
Level:Local
Topic:Awards and honours
ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌కు బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ప్రకటించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో దేశవ్యాప్తంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని మంత్రి లోకేశ్‌కు ఈ అవార్డు ప్రకటించిందని ఐటీశాఖ 2018 మే 16న వెల్లడించింది. జలవాణి, గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి మరో అవార్డు లభించిందని వెల్లడించింది.  
ట్రంప్‌-కిమ్‌ సమావేశం రద్దు చేసుకుంటామని ఉత్తర కొరియా హెచ్చరిక 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య ప్రతిపాదిత చరిత్రాత్మక భేటీ సందిగ్ధంలో పడింది. ఈ భేటీలో పాల్గొనే విషయాన్ని తాము పునఃపరిశీలించుకోవాల్సి ఉందంటూ ఉత్తర కొరియా ప్రకటించింది. ఏకపక్షంగా అణ్వాయుధాలను త్యజించాలంటూ తమపై ఒత్తిడి చేయాలని అమెరికా భావిస్తే ట్రంప్‌తో కిమ్‌ భేటీ రద్దు కావొచ్చని హెచ్చరించింది. దక్షిణ కొరియాతో 2018 మే 16న జరగాల్సిన ఉన్నతస్థాయి చర్చలను రద్దు చేసుకుంది.
  • సింగపూర్‌లో 2018 జూన్‌ 12న ట్రంప్‌-కిమ్‌ సమావేశం జరగాల్సి ఉంది
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2018 మే 16న న్యూడిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
  • హోమియోపతి విద్యలో పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న కేంద్ర హోమియోపతి మండలిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం . ప్రస్తుతం ఉన్న బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ బదులు ఏడుగురు ప్రముఖ హోమియోపతి వైద్యులు, పరిపాలన నిపుణులతో కమిటీని నియమించనుంది. 
  • నూతన జాతీయ జీవ ఇంధన విధానానికి ఆమోదం. పాడైన ఆహార ధాన్యాలు, కుళ్లిన బంగాళ దుంపలు, చెరకు, మొక్కజొన్న తదితరాలతో చేసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడానికి అనుమతి ఇవ్వనుంది. నూతన విధానం ప్రకారం జీవ ఇంధనాలను మూడు విభాగాలుగా విభజించింది. మొదటి తరం (జీ1)- కింద మొలాసిస్‌, నూనె గింజల(వంటనూనెలు కాకుండా)తో తయారు చేసే ఇథనాల్‌... రెండో తరం (జీ2)- మున్సిపల్‌ వ్యర్థాల నుంచి తయారు చేసే ఇంధనం... మూడో తరంలో(జీ3)- జీవ-సీఎన్‌జీ వంటి ఇంధనాలు వస్తాయి.
  • రక్షణ దళాల కోసం ప్రత్యేకంగా ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థ కల్పించడానికి ఉద్దేశించిన నెట్‌వర్క్‌ ఫర్‌ స్పెక్ట్రం (ఎన్‌ఎఫ్‌ఎస్‌) ప్రాజెక్టుకు మొత్తం 24,664 కోట్లు కేటాయింపు. గతంలో రూ.13,334 కోట్ల మంజూరుకు అంగీకారం తెలపగా, ప్రస్తుతం అదనంగా రూ.11,330 కోట్లు కేటాయించింది. ఇంతవరకు రక్షణ రంగం పరిధిలో ఉన్న స్పెక్ట్రంను మొబైల్‌ టెలిఫోన్‌ రంగానికి బదలాయించింది. దానికి బదులుగా రక్షణ రంగం కోసం ఎన్‌ఎఫ్‌ఎస్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
  • ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఉన్న వాణిజ్యపర వివాదాల కోసం పరస్పరం కేసులు పెట్టుకోకూడదని నిర్ణయం. రైల్వేలు, ఆదాయపు పన్ను, కస్టమ్స్‌-ఎక్సయిజ్‌ విభాగాలను ఇందునుంచి మినహాయించింది. వివాదాలు తలెత్తిన శాఖలు, న్యాయ కార్యదర్శితో కమిటీ ఏర్పాటవుతుంది. ఒక వేళ ఒకే మంత్రిత్వ శాఖ పరిధిలోని విభాగాల మధ్య వివాదం తలెత్తితే సంబంధిత శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, ప్రభుత్వ రంగ సంస్థ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లో దీనిపై నిర్ణయం వెలువరించాల్సి ఉంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కేబినెట్‌ కార్యదర్శి వద్దకు వెళ్తుంది. ఆయన మాటే తుది నిర్ణయం అవుతుంది.
తిరుమల తిరుపతి దేవాలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తొలగింపు
Event-Date:17-May-2018
Level:Local
Topic:Persons in News
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు ఎ.వి.రమణదీక్షితులును తొలగించాని టీటీడీ ధర్మకర్త మండలి తీర్మానించింది. ఆయనతో పాటు మరో ముగ్గురు అర్చకులకు కూడా ఉద్వాసన పలికింది. వీరందరికీ 65 సంవత్సరాల వయోపరిమితిని నిర్దేశించి ఉద్యోగ విరమణ కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అర్హత ఉన్న పక్షంలో వారసులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
  • టీటీడీ ఛైర్మన్‌ - పుట్టా సుధాకర్‌యాదవ్‌


స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2018 ర్యాంకులు
Event-Date:17-May-2018
Level:National
Topic:Awards and honours
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ 2018 మే 16న న్యూడిల్లీలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2018 ర్యాంకులను ప్రకటించారు.
  • జాతీయ స్థాయిలో 10 లక్షలకు పైబడి జనాభా గల పరిశుభ్ర నగరాల్లో విజయవాడ తొలి స్థానంలో నిలవగా, 1-3 లక్షల జనాభా విభాగంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ నగరంగా తిరుపతి, రాష్ట్రాల  రాజధానుల విభాగంలో అత్యుత్తమ ఘన వ్యర్థాల నిర్వహణ నగరంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ర్యాంక్‌లు సొంతం చేసుకున్నాయి.
  • లక్షలోపు జనాభా ఉన్న పట్టణాలకు జోన్ల వారీగా ర్యాంకులు ప్రకటించారు. అందులో తెలంగాణలోని సిద్దిపేట దక్షిణ జోన్‌లో పరిశుభ్ర పట్టణంగా నిలిచింది. బెస్ట్‌సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ విభాగంలో బోడుప్పల్‌, బెస్ట్‌ సిటీ ఇన్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ విభాగంలో ఫిర్జాదిగూడ ఉత్తమ పట్టణాుగా నిలిచాయి.
  • జాతీయస్థాయి ఉత్తమ పరిశుభ్ర నగరాలుగా ఇండోర్‌, భోపాల్‌, ఛండీగఢ్‌లు తొలి మూడు ర్యాంకులు కైవసం చేసుకున్నాయి.
  • పారిశుద్ధ్య నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • జాతీయస్థాయి విభాగంలో మొత్తం 23 ర్యాంకులు ప్రకటించగా అందులో తెలంగాణకు ఒకటి, ఆంధ్రప్రదేశ్‌కు రెండు దక్కాయి.
  • లక్షలోపు జనాభా ఉన్న పట్టణాలకు దక్షిణాది జోన్‌ స్థాయిలో ప్రకటించిన 4 ర్యాంకుల్లో తెలంగాణకు మూడు లభించాయి.
  • ఓడీఎఫ్‌ (30%), పారిశుద్ధ్యం గురించి సమాచారం, అవగాహన కల్పన (5%), పౌరుల ప్రవర్తనలో మార్పు (5%), నవకల్పన (5%), చెత్త సేకరణ, రవాణా (30%), సేకరించిన చెత్త శుద్ధి (25%)కి ఇస్తున్న ప్రాధాన్యం ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు.
  • మొత్తం 4,203 పట్టణ స్థానిక సంస్థలు పోటీపడ్డాయి. 37.66 లక్షల మంది నుంచి సమాచారం తీసుకున్నారు.















Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.