Type Here to Get Search Results !

May-09

May-09 Current affairs articles

ఆంధ్రప్రదేశ్‌ 2017-18 జీడీడీపీ గణాంకాలు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ.42,324కి పెరిగింది. 2016-17తో పోలిస్తే 2017-18లో 10 శాతానికి పైగా అధికమైంది. అప్పటికీ ఇప్పటికీ తేడా రూ.4,292. తలసరి ఆదాయం రూ.18,390 పెరిగింది. జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం రూ.1,12,764 ఉంది. దాంతో పోలిస్తే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.29,290 అధికం.
  • 2017-18లో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా రూ.1,89,121తో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.99,792తో శ్రీకాకుళం జిల్లా అట్టడుగున ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన కృష్ణా, విశాఖ, పశ్చిమగోదావరి, నెల్లూరు  జిల్లాల్లో తలసరి ఆదాయం, రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది.
  • 2018 మే 8న జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రణాళికా విభాగం ఈ వివరాలను విడుదల చేసింది.
  • 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీడీపీ)లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా, విజయనగరం అట్టడుగున నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.8,03,873 కోట్లు కాగా..అందులో అత్యధిక శాతం వాటా (రూ.97,059 కోట్లు) కృష్ణా జిల్లా నుంచి సమకూరగా, అత్యల్ప  వాటా (రూ.28,360 కోట్లు) విజయనగరం నుంచి వచ్చింది. 
  • పారిశ్రామిక, సేవా రంగాల్లో విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంది
  • వ్యవసాయ అనుబంధ రంగాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. 
  • వ్యవసాయ-అనుబంధ రంగాల్లో శ్రీకాకుళం, పారిశ్రామిక, సేవా రంగాల్లో విజయనగరం జిల్లాలు అట్టడుగున ఉన్నాయి. 
  • పారిశ్రామిక, సేవా రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విశాఖపట్నం వ్యవసాయ-అనుబంధ రంగాల్లో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. 
  • వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవా రంగంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన కృష్ణా జిల్లా పారిశ్రామికంగా నాలుగో స్థానంలో ఉంది. 
  • పారిశ్రామిక రంగంలో వెనుకబడిన అనంతపురం వ్యవసాయ అనుబంధ రంగాల్లో అయిదో స్థానంలో నిలిచింది.
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) ఇచ్చిన రుణాల మీద వడ్డీ రూపేణా వచ్చిన ఆదాయంలో 3.2 శాతం వృద్ధి నమోదైంది. 2017-18 సంవత్సరం ఫలితాలను సంస్థ విడుదల చేసింది. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.280.26 కోట్ల ఆదాయం రాగా.. అంతకుముందు సంవత్సరం రూ.270.38 కోట్లు ఆర్జించింది. ఖర్చు రూ.61.55 కోట్ల నుంచి రూ.55.11 కోట్లకు తగ్గినట్లు ఫలితాలు వెల్లడించాయి.
  • పశుపోషణలో ప్రకాశం, మత్స్య పరిశ్రమలో కృష్ణా, తయారీ రంగంలో విశాఖపట్నం ప్రథమ స్థానంలో నిలిచాయి
  • 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయం-అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల్లోని 14 ఉప రంగాల నుంచి సమకూరిన స్థూల విలువ జోడింపు (జీవీఏ) ఆధారంగా ఆయా ఉప రంగాల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న జిల్లాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

-------------------------------------------------------------------------------------------

జపాన్‌ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం
Event-Date:09-May-2018
Level:International
Topic:Persons in News
ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న జపాన్‌ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్రాయెల్‌ ప్రధాని కుటుంబంతో కలసి విందుకు హాజరైన అబేకు చెఫ్‌ బూటులో ఆహార పదార్థాలను ఉంచి సర్వ్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. నెతన్యాహు అత్యంత ఇష్టపడే చెఫ్‌ మోషే సెర్గీ ఈ విందుకు వంటకాలను తయారు చేశారు. అబేకు డిసర్ట్‌తో పాటు ఓ బూటులో చాకెట్లను ఉంచి సర్వ్‌ చేయడంపై జపాన్‌ దౌత్యవేత్తలు భగ్గుమన్నారు. బూటుతో ఆహారాన్ని అందించడాన్ని జపాన్‌లో తీవ్రంగా, ఘోర అవమానంగా భావిస్తారని చెప్పారు.
  • ఈ ఘటనపై చెఫ్‌ సెర్గీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అది నిజమైన షూ కాదని, మెటల్‌తో తయారు చేసిన వస్తువని వెల్లడించారు.
  •  భోజన వడ్డన సమయంలో సెర్గీ వివాదాల్లో ఇరుక్కోవడం ఇది తొలిసారేమీ కాదు. 2017 నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా ట్రంప్‌, నెతన్యాహూ ముఖచిత్రాలు కలిగిన బౌల్స్‌లో సెర్గీ డిసర్ట్స్‌ను సర్వ్‌ చేశారు.

ఫిడే రేటెడ్‌ చెస్‌ విజేత బాలకృష్ణ 
Event-Date:09-May-2018
Level:Local
Topic:Sports and Games
ఐజీఎంఎస్‌ఏ ఫిడే బిలో 1500 రేటింగ్‌ చెస్‌ టోర్నీలో కె.బాలకృష్ణ విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఓపెన్‌ విభాగంలో 9 రౌండ్లు ముగిసిన తర్వాత 8 పాయింట్లు సాధించిన బాలకృష్ణ టైటిల్‌ గెలిచాడు. సాయి నిఖిల్‌ కూడా 8 పాయింట్లు సాధించినా.. మెరుగైన స్కోరింగ్‌ కలిగిన బాలకృష్ణ విజేతగా నిలిచాడు. చివరి రౌండ్లో అతను లోక ప్రకాశ్‌ను ఓడించాడు. సాయి నిఖిల్‌ రన్నరప్‌గా నిలవగా.. గోపీచంద్‌ మూడో స్థానం సాధించాడు.
  • విజేతకు ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు బహుమతి లభించగా.. రన్నరప్‌కు రూ.35 వేలు, మూడో స్థానంలో నిలిచిన ఆటగాడికి రూ.30  వేలు బహుమతిగా దక్కాయి. ఈ టోర్నీలో పాల్గొన్న క్రీడాకారుల కోసం తీసిన లాటరీలో శ్రీహర్షిత (భద్రాచలం) యమహా బైక్‌ దక్కించుకుంది. ఈ లక్కీడిప్‌ను సినీ నటి మధుశాలిని తీసింది.

థామస్‌-ఉబెర్‌ కప్‌ భారత జట్ల సారథులుగా ప్రణయ్‌, సైనా నెహ్వాల్‌
Event-Date:09-May-2018
Level:National
Topic:Sports and Games
థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మహిళల జట్టుకు సైనా నెహ్వాల్‌, పురుషుల బృందానికి హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సారథులుగా ఎంపికయ్యారు.
  • 2018 మే 20న బ్యాంకాక్‌లో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.
  • ఉబెర్‌ కప్‌లో పాల్గొనే మహిళల జట్టులో సైనాతో పాటు వైష్ణవి జక్కారెడ్డి, సాయికృష్ణ ప్రియ, ప్రభు, వైష్ణవి భాలె సింగిల్స్‌ ఆడనున్నారు.
  • డబుల్స్‌ బరిలో మేఘన, పూర్విష, ప్రజక్త సావంత్‌, సంయోగిత ఉన్నారు.
  • థామస్‌ కప్‌లో పాల్గొనే పురుషుల జట్టులో సింగిల్స్‌ కోసం ప్రణయ్‌, సాయిప్రణీత్‌, సమీర్‌వర్మ, లక్ష్యసేన్‌ డబుల్స్‌కు సుమీత్‌ రెడ్డి, మను అత్రి, శ్లోక్‌, అర్జున, సన్యమ్‌ శుక్లా, అరుణ్‌ జార్జ్‌ ఎంపికయ్యారు.
  • సింధు, శ్రీకాంత్‌తో పాటు మరికొందరు ప్రముఖ షట్లర్లు టోర్నీకి దూరంగా ఉన్నారు.

ఆసీస్‌ వన్డే కెప్టెన్‌గా పైన్‌ 
Event-Date:09-May-2018
Level:International
Topic:Sports and Games
ఆసీస్‌ కొత్త కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ 2018 జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించే ఆస్ట్రేలియా వన్డే జట్టుకు టిమ్‌ పైన్‌ను కెప్టెన్‌గా నియమించాడు. ఆరోన్‌ ఫించ్‌కు టీ20 జట్టు బాధ్యతలు దక్కాయి. బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణానికి సంబంధించి స్టీవ్‌ స్మిత్‌ ఏడాది నిషేధానికి గురైన నేపథ్యంలో ఆసీస్‌కు కొత్త కెప్టెన్ల నియామకం అవసరమైంది. ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 2018 జూన్‌ 13న లార్డ్స్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్‌ జరుగుతుంది.

ఆంధ్రా బ్యాంకు డిపాజిట్లపై స్వల్పంగా వడ్డీరేట్లు పెంపు 
Event-Date:09-May-2018
Level:National
Topic:Economic issues
ఏడాది నుంచి 10 సం॥ల కాలపరిమితి గల రిటైల్‌ డిపాజిట్లపై వడ్డీరేటును ఆంధ్రాబ్యాంకు 10-25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. రూ.కోటి కన్నా తక్కువ మొత్తం డిపాజిట్లపై 1-2 ఏళ్లకు ఇప్పటి వరకు 6.5 శాతం వడ్డీ రేటు ఉండగా,  ఇకపై 6.6 శాతం చెల్లించనుంది. రెండేళ్ల నుంచి పదేళ్ల వరకూ చేసే డిపాజిట్లపై వడ్డీరేటును 6.25 శాతం నుంచి 6.5 శాతానికి బ్యాంకు సవరించింది. రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వరకూ చేసే బల్క్‌ డిపాజిట్లపై కొన్ని కాలపరిమితులు వడ్డీరేట్లను కూడా 35-175 బేసిస్‌ పాయింట్లు పెంచింది. సవరించిన వడ్డీరేట్లు 2018 మే 7 నుంచి అమలులోకి వచ్చాయి.  

2018లో భారత వృద్ధి 7.2% : ఐక్యరాజ్యసమితి 
Event-Date:09-May-2018
Level:National
Topic:Economic issues
కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్లలో బలహీనత, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ప్రభావంతో 2017లో భారత వృద్ధి నెమ్మదించిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఆ ప్రభావాల నుంచి కోలుకుని, ఈ ఏడాది నుంచి వృద్ధిరేటు క్రమక్రమంగా పుంజుకుంటుందని పేర్కొంది. ‘2017లో భారత వృద్ధి 6.6 శాతంగా నమోదైంది. 2016లో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నందున, 2018లో 7.2%, 2019లో 7.4% చొప్పున వృద్ధి నమోదు కావచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
  • ‘ప్రైవేట్‌ పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. కార్పొరేట్‌ రంగం కొత్త పన్నుల విధానానికి అలవాటు పడుతోంది. మౌలిక పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ మద్దతుతో కార్పొరేట్‌, బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్లు పటిష్ఠం అవుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా భారత వృద్ధి క్రమక్రమంగా పుంజుకుంటుందని భావిస్తున్నామ’ని నివేదికలో పేర్కొంది.
  • దివాలా స్మృతి, ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ చర్యలు భారత్‌లో ప్రైవేట్‌ పెట్టుబడులు క్రమక్రమంగా పెరిగేందుకు దోహదం చేస్తాయని వివరించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పక్కకుపోవడంతో వినియోగం తిరిగి పుంజుకుందని పేర్కొంది.
  • ‘నిరర్థక ఆస్తులు రెట్టింపయ్యాయి. 2017 మధ్య కల్లా ఒత్తిడిలో ఉన్న బ్యాంకు రుణాలు రికార్డు స్థాయిలో రూ.9.5 లక్షల కోట్లకు చేరాయి. ఈ విలువ మరింత ఎక్కువగా ఉండచ్చొని కొన్ని నివేదికల ఆధారంగా తెలుస్తోంద’ని పేర్కొంది. అందువల్ల ప్రైవేటు పెట్టుబడులు మందగమనంతోనే ఉంటాయని, జీడీపీ వృద్ధి అధికంగా ఉండదని అంచనా వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాలు బాగా పెరగడం వల్ల  ద్రవ్య్బోణంలో వృద్ధికి కారణమైందని వెల్లడించింది.

10 నుంచి డిల్లీలో ఆసియా మీడియా సదస్సు
కేంద్ర సమాచార శాఖ ఆధ్వరంలో 2018 మే 10 నుంచి 12 వరకు డిల్లీలో ‘ఆసియా మీడియా సదస్సు’ను నిర్వహించనున్నారు. ‘టెల్లింగ్‌ అవర్‌ స్టోరీస్‌-ఏసియా అండ్‌ మోర్‌’ అనే థీమ్‌తో జరిగే ఈ సదస్సులో ఆసియా పరిధిలో సమాచార, ప్రసార రంగంలో ఎదురౌతున్న సవాళ్లు, సహకారంపై చర్చించనున్నారు. 

త్రీడీ ముద్రిత ఆయుధాలతో ప్రపంచ భద్రతకు ముప్పు 
త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీ చాలా తేలికై ఉగ్రవాదుల నుంచి సాధారణ వీధి గూండాల వరకూ అందరూ తేలిగ్గా ఆయుధాలను పొందుతారని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ రాండ్‌ కార్పొరేషన్‌ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ భద్రతను ముప్పులో పడేస్తుందన్నారు. త్రీడీ ముద్రణ పరిజ్ఞానానికి హ్యాకింగ్‌ ముప్పు ఉందన్నారు. హ్యాకర్లు దురుద్దేశంతో ఆ ప్రింటర్లలోకి తప్పుడు సూచనలు లేదా ఆల్గోరిథమ్‌ను చొప్పించగలుగుతారని వెల్లడించారు.
  • విమానాల్లోని కీలకమైన భాగాల్లో లోపాలు తలెత్తేలా చేస్తారని వివరించారు. త్రీడీ ముద్రణ పరిజ్ఞానం మరింత చేరువైనప్పుడు.. ఉగ్రముఠాతో ప్రమేయం లేకుండా వ్యక్తులు విడిగా చేపట్టే దాడులు మరింత తీవ్రమవుతాయని చెప్పారు. తుపాకీ నియంత్రణ చట్టాలు పటిష్టంగా లేని అమెరికా వంటి దేశాల్లోనూ ఈ పరిజ్ఞానం వల్ల హింస మరింత పెరుగుతుందన్నారు. ఉత్తర కొరియా వంటి దేశాల మనుగడ తేలికవుతుందని చెప్పారు. అంతర్జాతీయ ఆంక్షలున్నప్పటికీ సంక్లిష్టమైన భాగాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని ఆ దేశాలు సాధించగుగుతాయని పేర్కొన్నారు

లైంగికదాడి బాధితుల్లో 5-10శాతం మందికే పరిహారం : నల్సా
దేశవ్యాప్తంగా లైంగిక దాడి బాధితుల్లో 5-10 శాతం మందికే సంబంధిత పథకాల కింద పరిహారం అందుతోందని వెల్లడయింది. రాష్ట్రాల న్యాయసేవల సంస్థల అందించిన డేటాను సంకలనం చేశామని, 5-10శాతం మంది బాధితులకే పరిహారం అందుతోందని తేలిందని జాతీయ న్యాయసేవ సంస్థ (నల్సా) న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తలతో కూడిన ధర్మాసనానికి 2018 మే 8న తెలియజేసింది. ఇది ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో 2017లో 901 కేసులు నమోదు కాగా ఒక బాధితురాలికే పరిహారం అందిందని తెలిపింది.
  • నల్సా డేటా ప్రకారం 2016లో 840 కేసు నమోదులు కాగా 8 మంది బాధితులకే పరిహారం అందింది.
  • పోస్కో చట్టం ప్రకారం 2017లో 1,028 కేసులు నమోదు కాగా 11 మంది బాధితులకే పరిహారం అందింది.
NALSA-National Legal Services Authority 

నాథూలా పాస్‌ను తిరిగి తెరిచిన చైనా
కైలాష్‌ మానసరోవర్‌ యాత్ర నేపథ్యంలో నాథూలా పాస్‌ను తిరిగి రాకపోకల నిమిత్తం తెరిచినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ 2018 మే 8న ప్రకటించారు. డోక్లాం సంక్షోభం నేపథ్యంలో సిక్కిం వైపు నాథూలా పాస్‌ను చైనా 2017లో పూర్తిగా మూసివేసింది. 2018  జూన్‌ 8 నుంచి మొదలయ్యే కైలాష్‌-మానసరోవర్‌ యాత్ర 4 నెలల పాటు కొనసాగుతుంది. 

ప్రపంచంలోనే తొలిసారిగా రోబో సాయంతో కణితి తొలగింపు
అత్యంత అరుదుగా మెడ లోపలి భాగంలోని ఎముకపై ఏర్పడే కణితిని ప్రపంచంలోనే తొలిసారిగా రోబో సాయంతో వైద్యులు విజయవంతంగా తొలగించారు. అమెరికాలోని భారత సంతతి వైద్యుడు నీల్‌ మల్హోత్రా నేతృత్వంలోని శస్త్రచికిత్సా నిపుణుల బృందం ఈ చికిత్స నిర్వహించింది.
  • కార్డోమా చాలా అరుదైన క్యాన్సర్‌. పుర్రె, వెన్నెముకపై కణితుల రూపంలో ఇది పీడిస్తుంది. చివరి దశల్లోనే దీని క్షణాలు పైకి కనిపిస్తాయి. అదృష్టవశాత్తు 27ఏళ్ల నోవా పెర్నికాఫ్‌ విషయంలో మాత్రం ఇది తొలి దశలోనే బయటపడింది. 2016లో కారు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అప్పుడు తీసిన ఎక్స్‌రేల్లో ఈ కణితి వెలుగు చూసింది. దీంతో అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ ఆసుపత్రిని ఆయన ఆశ్రయించారు. అక్కడ నీల్‌ నేతృత్వంలోని బృందం క్లిష్టమైన మూడంచెల శస్త్రచికిత్స నిర్వహించింది. మొదటగా మెడ వెనుక వైపునుంచి కణితిచుట్టూ ఉన్న వెన్నెముక భాగాన్ని తొలగించారు. రెండో దశలో నోటి గుండా రోబోను పంపి కణితిని లేకుండా చేశారు. చివరగా మెడ వెనుక నుంచి వెన్నెముకను పునరుద్ధరించారు. దీని కోసం పెర్నికాఫ్‌ తుంటి ఎముకలో కొంత భాగాన్ని ఉపయోగించారు.

ఆర్మీనియా నూతన ప్రధానిగా నికోల్‌ పాష్నియాన్‌ 
Event-Date:09-May-2018
Level:International
Topic:Persons in News
ఆర్మీనియా దేశ నూతన ప్రధానిగా నికోల్‌ పాష్నియాన్‌ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడైన ఆయనను 2018 మే 8న ఆ దేశ పార్లమెంటు ప్రధాని పదవికి ఎన్నుకుంది. ఆయనకు మద్దతుగా 59 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి.
  • అధికార రిపబ్లికన్‌ పార్టీకి వ్యతిరేకంగా నికోల్‌ ఇటీవల కొన్ని వారాల పాటు పెద్ద ఉద్యమం నడిపించడంతో దేశ రాజకీయ పరిస్థితు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నిక జరిగింది.
  • దేశంలో రాజకీయ స్థిరత్వం కోసమే నికోల్‌కు మద్దతు ఇచ్చినట్లు రిపబ్లికన్‌ పార్టీ పేర్కొంది.
హజ్‌ నిర్వాహకులకు పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం
చట్టవిరుద్ధంగా అనర్హత వేటు వేసి వ్యాపారానికి దూరం చేసినందుకుగాను ఏడుగురు హజ్‌ యాత్ర నిర్వాహకులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్ని పత్రాల సమర్పణలో యాత్ర నిర్వాహకులకు మినహాయింపులిచ్చిన కేంద్రం.. తిరిగి ఆ పత్రాలు సమర్పించలేదన్న కారణంతోనే వారిపై నిషేధం విధించడం పట్ల జస్టిస్‌ జె.చలమేశ్వర్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌తో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగశాఖ చేసిన పనిని ‘మతిలేని చర్య’గా అభివర్ణించింది. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. 
బెర్ముడా తీరంలో 100కు పైగా కొత్త జాతుల గుర్తింపు
Event-Date:09-May-2018
Level:International
Topic:Places in News
గతంలో ఎన్నడూ కనిపించని 100కు పైగా కొత్త జాతుల జీవులను బెర్ముడా తీరంలోని మహాసముద్ర ప్రాంతంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. కాంతి అరుదుగా ప్రసరించే ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం చాలా బాగుందని వారు తెలిపారు. డజన్ల కొద్దీ కొత్త శైవ జాతులు, రెండు మీటర్ల ఎత్తువరకు పెరిగే నల్లటి తీగల వంటి ప్రవాళాలు ఇక్కడ బయటపడ్డాయని వెల్లడించారు. 
మూత్రపిండాలపై పరిశోధనలకు తాహిర్‌ హుస్సేన్‌కు రూ.10.7 కోట్లు 
Event-Date:09-May-2018
Level:International
Topic:Persons in News

ఊబకాయంతో మూత్రపిండాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించే ఔషధాల తయారీ దిశగా విస్తృత పరిశోధనలు చేసేందుకుగాను భారతీయ అమెరికన్‌ ప్రొఫెసర్‌ తాహిర్‌ హుస్సేన్‌కు నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ నుంచి దాదాపు రూ.10.7 కోట్ల భారీ మొత్తం మంజూరైంది.
  • సాధారణంగా మూత్రపిండాల్లోని కొన్ని కణాలు ‘ఆంజియోటెన్సిన్‌ టైప్‌ 2 రిసెప్టార్‌(ఏటీ2ఆర్‌)’ అనే ప్రోటీన్‌ను విడుదల చేస్తుంటాయని తాహిర్‌ తెలిపారు.
  • ఊబకాయం కారణంగా మూత్రపిండాల్లో తీవ్రమైన వాపు, మంట సంభవించకుండా రక్షణగా నిలిచే సామర్థ్యం ఈ ప్రోటీన్‌ సొంతమని వెల్లడించారు.
  • అయితే, ‘ఏటీ2ఆర్‌’ శరీరంలో పెద్దగా క్రియాశీలంగా ఉండదని పేర్కొన్నారు. ఔషధాలతో ఈ ప్రోటీన్‌ను క్రియాశీలం చేయగలిగితే.. ఊబకాయుల్లో మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడవచ్చునని వివరించారు.
  • తాహిర్‌ ప్రస్తుతం హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఔషధ విజ్ఞానశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

సౌదీ మహిళలు వాహనాలు నడిపేందుకు అనుమతి
18 ఏళ్లకు పైబడిన వయసున్న మహిళలు డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సౌదీ అరేబియా అనుమతించింది. దీంతో 2018 జూన్‌ 24 నుంచి సౌదీలో మహిళలు వాహనాలు నడపవచ్చు. మహిళలు డ్రైవింగ్‌ చేయడంపై 10 సం॥ల పాటు కొనసాగిన నిషేధాన్ని 2017 సెప్టెంబరులో తొలగించారు. మహిళలకు ప్రత్యేకంగా డ్రైవింగ్‌ నేర్పించేందుకు 5 నగరాల్లో శిక్షణ స్కూళ్లకు అనుమతిని మంజూరు చేశారు.
  • విదేశాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పొంది ఉన్న మహిళలు మాత్రం మరో ప్రత్యేక ప్రక్రియ ద్వారా స్థానిక లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సౌదీ మహిళలు ఎప్పటి నుంచో డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. 
దివ్యాంగులకు తోడ్పడే ఆవిష్కరణకు మైక్రోసాఫ్ట్‌ AI for Accessibility
దివ్యాంగులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం రూ.167.5 కోట్లతో AI for Accessibility కార్యక్రమాన్ని చేపట్టింది. 5 సం॥ల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంధత్వం, వినికిడి లోపం, నడవలేకపోవడం, మేధో సమస్యలు వంటివాటితో బాధపడుతున్నవారికి.. ఉద్యోగం, ఆధునిక జీవితం, మానవ సంబంధాల విషయంలో తోడ్పాటుగా నిలిచే పరిష్కారాల కోసం చూస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది.
  • ప్రపంచంలోని ప్రతి 10 మంది దివ్యాంగుల్లో కేవలం ఒకరికే తోడ్పాటుగా నిలిచే సాంకేతికతలు, ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది. ఈ నూతన కార్యక్రమం ద్వారా డెవలపర్లు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆవిష్కర్తలకు సాంకేతికపరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది.
అఫ్గాన్‌లో అపహరణకు గురైన భారతీయుల విడుదలకు యత్నాలు
అఫ్గానిస్థాన్‌లో అపహరణకు గురైన ఏడుగురు భారతీయులను సురక్షితంగా విడిపించేందుకు భారత్‌ కృషి చేస్తోంది. 2018 మే 7న భారత్‌ రాయబారి వినయ్‌ కుమార్‌  అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి సలాహుద్దీన్‌ రబ్బానీతో సమావేశమయ్యారు.బందీలను విడిపించడంపై సుదీర్ఘ చర్చలు జరిపారు.
  • అఫ్గాన్‌లోని కల్లోలిత బాగ్లాన్‌ ప్రావిన్స్‌లో ఆర్‌పీజీ తరఫున పనిచేస్తున్న ఏడుగురు భారతీయ ఇంజినీర్లను 2018 మే 6న తాలిబాన్లు కిడ్నాప్‌ చేశారు. 
జిన్‌పింగ్‌ ప్రత్యర్థి సున్‌ జేంగ్‌కయీకి జీవిత ఖైదు
Event-Date:09-May-2018
Level:International
Topic:Persons in News
జిన్‌పింగ్‌ తర్వాత చైనా అధ్యక్షుడు అవుతారనుకున్న కమ్యూనిస్ట్‌పార్టీ మాజీ సీనియర్‌ నేత సున్‌ జేంగ్‌కయీకి జీవిత ఖైదు పడింది. లంచం కేసులో ఆయనకు తియాంజిన్‌ మున్సిపాలిటీ ఫస్ట్‌ ఇంటర్మీడియేట్‌ పీపుల్స్‌ కోర్టు 2018 మే 8న ఈ శిక్షను విధించింది. జీవితకాలం పాటు ఆయన రాజకీయ హక్కులను రద్దు చేసింది. సున్‌ వ్యక్తిగత ఆస్తుల జప్తునకు కూడా ఆదేశించింది. 2002-17 మధ్య వివిధ హోదాల్లో పనిచేసిన సున్‌ 26.7 మిలియన్‌ డాలర్ల మేర లంచాలు పుచ్చుకున్నట్లు నిర్ధారించింది. 
  • అధ్యక్షునిగా జిన్‌పింగ్‌ తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా సున్‌ ఉండేవారు. క్రమంగా పార్టీలో ఆయన ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది.
  • ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్‌ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సున్‌ కుట్ర పన్నినట్లు ఆరోపణలొచ్చాయి.
  • 2017 అక్టోబరులో జాతీయ సదస్సు (కాంగ్రెస్‌)కు ముందే పార్టీ నాయకత్వం ఆయనను బహిష్కరించింది.
  • తర్వాత రెండోసారి అధ్యక్షునిగా జిన్‌పింగ్‌ పట్టాభిషేకానికి కాంగ్రెస్‌ ఆమోదించడం, ఒక వ్యక్తి గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనను పార్లమెంటు ఎత్తివేయడం చకచకా జరిగిపోయాయి.
  • 2013లో జిన్‌పింగ్‌ అధికారం చేపట్టింది మొదలు అవినీతి నిర్మూలన పేరుతో తన వ్యతిరేకులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారన్న విమర్శలున్నాయి.
హైదరాబాద్‌లో గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌-2018
Event-Date:09-May-2018
Level:Local
Topic:Places in News
పర్యావరణ హిత నిర్మాణాలపై నిర్వహించే జాతీయ సదస్సు గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌-2018కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 2018 అక్టోబరు 31 నుంచి నవంబరు 3 వరకు నాలుగు రోజుల పాటు హెచ్‌ఐసీసీ వేదికగా ఈ సదస్సు జరగుతుంది. హరిత భవనాలకు సంబంధించిన సేవలు, సాంకేతికత, ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు.  
గుండ్లపోచంపల్లిలో హస్తకళల శిక్షణ కేంద్రం 
హస్తకళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని గుండ్లపోచంపల్లి అపారెల్‌ పార్కులో ఏర్పాటు చేయాలని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. పార్కులో దుస్తుల తయారీతో సంబంధం లేకుండా ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థలకు అనుమతులు రద్దు చేసి, సంబంధిత భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాల విక్రయాలకు టెస్కో ద్వారా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్గదర్శనం చేశారు.  
బంగాళాఖాతం గర్భంలో భారీ స్థాయిలో ఖనిజ సంపద 
Event-Date:09-May-2018
Level:Local
Topic:Miscellaneous(General)
బంగాళాఖాతం గర్భంలో భారీ స్థాయిలో ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నట్లు భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) పరిశోధనల్లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పూడిమడక నుంచి ఒడిశాలోని పారాదీప్‌ వరకు 580 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తీరంలోని సాగరగర్భంలో దాదాపు రూ.46 వేల కోట్ల విలువైన భారలోహ ఖనిజ నిక్షేపాలున్నట్లు శాస్త్రవేత్తల అన్వేషణలో తేలింది. దీనికి సంబంధించిన నివేదికను జీఎస్‌ఐ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.
  • టెండర్ల ద్వారా వీటి వెలికితీతే మిగిలింది. ఇందులో వచ్చే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా వాటా ఎంత? అనేది తేలాల్సి ఉంది. వివిధ పరిశోధనల్లో వినియోగించే ఈ భార ఖనిజాల ఆదాయం రాష్ట్రాభివృద్ధికి ఉపకరించనుంది.
  • జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మిషన్‌-1ఎలో భాగంగా చేపట్టిన అన్వేషణలో తూర్పు కోస్తా పరిధిలోని విశాఖపట్నం మెరైన్‌ అండ్‌ కోస్టల్‌ సర్వే విభాగం పరిధిలో అన్వేషణ సాగింది. ఒడిశాతోపాటు ఉత్తరాంధ్ర పరిధిలోని బారువ, భావనపాడు, సంతపల్లి, భీమునిపట్నం, పూడిమడక, గోపాల్‌పూర్‌, పాలూరు ప్రాంతాల్లోని సముద్రగర్భంలో నిక్షేపాలను గుర్తించారు.
  • తీరానికి పది నాటికల్‌ మైళ్ల దూరంలో 260 బ్లాకుల్లో 38.4 టన్నుల భార లోహాలు నిల్వ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.46 వేల కోట్లుంటుందని అంచనా. జీఎస్‌ఐ నివేదిక ఆధారంగా కేంద్రం చర్యలకు ఉపక్రమించనుంది. 
బంగాళాఖాతం గర్భంలో భారీ స్థాయిలో ఖనిజ సంపద 
Event-Date:09-May-2018
Level:Local
Topic:Miscellaneous(General)
బంగాళాఖాతం గర్భంలో భారీ స్థాయిలో ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నట్లు భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) పరిశోధనల్లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పూడిమడక నుంచి ఒడిశాలోని పారాదీప్‌ వరకు 580 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తీరంలోని సాగరగర్భంలో దాదాపు రూ.46 వేల కోట్ల విలువైన భారలోహ ఖనిజ నిక్షేపాలున్నట్లు శాస్త్రవేత్తల అన్వేషణలో తేలింది. దీనికి సంబంధించిన నివేదికను జీఎస్‌ఐ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.
  • టెండర్ల ద్వారా వీటి వెలికితీతే మిగిలింది. ఇందులో వచ్చే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా వాటా ఎంత? అనేది తేలాల్సి ఉంది. వివిధ పరిశోధనల్లో వినియోగించే ఈ భార ఖనిజాల ఆదాయం రాష్ట్రాభివృద్ధికి ఉపకరించనుంది.
  • జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మిషన్‌-1ఎలో భాగంగా చేపట్టిన అన్వేషణలో తూర్పు కోస్తా పరిధిలోని విశాఖపట్నం మెరైన్‌ అండ్‌ కోస్టల్‌ సర్వే విభాగం పరిధిలో అన్వేషణ సాగింది. ఒడిశాతోపాటు ఉత్తరాంధ్ర పరిధిలోని బారువ, భావనపాడు, సంతపల్లి, భీమునిపట్నం, పూడిమడక, గోపాల్‌పూర్‌, పాలూరు ప్రాంతాల్లోని సముద్రగర్భంలో నిక్షేపాలను గుర్తించారు.
  • తీరానికి పది నాటికల్‌ మైళ్ల దూరంలో 260 బ్లాకుల్లో 38.4 టన్నుల భార లోహాలు నిల్వ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.46 వేల కోట్లుంటుందని అంచనా. జీఎస్‌ఐ నివేదిక ఆధారంగా కేంద్రం చర్యలకు ఉపక్రమించనుంది. 
కేసీఆర్‌పై బ్రిటన్‌లోని టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు నాణేల ముద్రణ 
Event-Date:09-May-2018
Level:Local
Topic:Miscellaneous(General)

బ్రటన్‌లోని టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల సంఘం అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్‌గౌడ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కారుపై నాణేలను రూపొందించారు. 2018 మే 8న హైదరాబాద్‌లో వాటిని సీఎంకు అందజేశారు. 
ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా
చరిత్రాత్మకమైన పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఇపుడు ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి కూడా వైదొలగింది.బరాక్‌ ఒబామా హయాంలో 6 దేశాలు రెండేళ్ల పాటు చర్చించి అమల్లోకి తెచ్చిన ఈ కీలక ఒడంబడిక నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2018 మే 8న ప్రకటించారు. ‘‘ఇరాన్‌ అణు ఒప్పందం విధ్వంసకరం. ఏకపక్షం. అమెరికాకు ఇబ్బందికరం. నిర్మాణాత్మక ఒప్పందం కుదిరి ఉండాల్సింది. కానీ, అలా జరగలేదు. సిరియా సహా అనేక చోట్ల ఇరాన్‌ దుర్మార్గాలకు పాల్పడిందని పేర్కొన్నారు. 2015లో ఒప్పందం కుదిరినప్పుడు ఎత్తివేసిన ఆంక్షలన్నింటినీ ఇరాన్‌పై తిరిగి విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. మిత్ర దేశాలు, సైనిక సలహాదారుల సూచనను కాదని ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు.
ఇరాన్‌ అణు ఒప్పందం నేపథ్యం
  • ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక పేరుతో 2015 జులైలో 6 దేశాల చర్చ బృందంతో ఇరాన్‌ వియన్నాలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది రెండేళ్ల చర్చోపచర్చల ఫలితం. ఇరాన్‌ అణు కార్యక్రమంపై 12 ఏళ్ల పాటు సాగిన ప్రతిష్టంభనకు ఇది ముగింపు పలికింది.
  • ఇరాన్‌ అణు కార్యక్రమానికి బ్రేకు వేయడం, అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యం ఆ దేశానికి ఉండదని ప్రపంచానికి భరోసాను ఇవ్వడం ఒప్పందం ఉద్దేశం. దీని అమల్లో భాగంగా అణుపదార్థాల శుద్ధికి ఉపయోగించే సెంట్రిఫ్యూజుల్లో మూడింట రెండొంతులను ఇరాన్‌ నిలిపివేసింది. శుద్ధిచేసిన యురేనియంలో 98 శాతాన్ని వేరేచోటుకు తరలించింది. ప్లుటోనియం ఉత్పత్తి రియాక్టర్‌ను కాంక్రీటుతో నింపేసింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థల తనిఖీదారుల పర్యవేక్షణకు కూడా ఒప్పుకొంది. దీనికి బదులుగా 2016 జనవరిలో అణుసంబంధ ఆంక్షల నుంచి ఇరాన్‌కు స్వేచ్ఛ లభించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లకు తిరిగి అనుసంధానం కాగలిగింది.
  • ఇరాన్‌ అణు చర్చల్లో భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికాతో పాటు జర్మనీ కూడా పాలుపంచుకుంది. ఈ అణు ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా అంతర్జాతీయ చట్టంగా మార్చారు.
  • 2016 నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాక ఇరాన్‌ అణు ఒప్పందం భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఇది ‘విధ్వంసకర ఒప్పంద’మని తాను ఎన్నికయ్యాక దాన్ని రద్దు చేస్తానని ఆయన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అయితే రద్దు వరకూ వెళ్లకుండా  మరింత కఠినంగా దాన్ని అమలు చేయడం, ఇప్పటికే ఉన్న ఆంక్షలను తీవ్రతరం చేయడం వంటి చర్యలకు ఆయన దిగుతారని భావించారు. దీనివల్ల ఇరాన్‌ సదరు ఒప్పందాన్ని ఉల్లంఘించడం కానీ దాన్ని నిర్వీర్యం చేయడం కానీ చేస్తుందని విశ్లేషించారు.
  • అమెరికా కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారం ప్రతి 120 రోజులకోసారి ఆంక్షలను ట్రంప్‌ తొలగించాల్సి ఉంది. 2018 జనవరిలో ట్రంప్‌ అయిష్టంగానే ఆ చర్యను చేపట్టారు. అయితే ఇదే చివరి అవకాశమని ఆయన అప్పట్లోనే స్పష్టం చేశారు. ఒప్పందంలోని లోపాలను సరిచేసే విషయంలో అమెరికాతో కలసి రావాలని ఐరోపా దేశాలను కోరారు. కాంగ్రెస్‌ గడువు 2018 మే 12తో ముగుస్తుంది. అప్పటివరకూ ఆగకుండా 2018 మే 8 రోజునే తన నిర్ణయాన్ని ప్రకటించారు. 
  • ఇది సరైన ఒప్పందం కాదని, ఇరాన్‌ ప్రాంతీయ వ్యవహారశైలిని, క్షిపణి కార్యక్రమాన్ని నియంత్రించడంలో ఇది విఫలమైందన్నది ట్రంప్‌ భావన. దీనికితోడు ఆయనకు సన్నిహితులుగా ఉన్న జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్ట్ న్‌, విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వంటి వారు ఇరాన్‌కు వ్యతిరేకులు కావడం కూడా దీనికి దోహదపడింది.
  • అమెరికా మినహా మిగతా ఐదు భాగస్వామ్య దేశాలు ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని కోరుతున్నాయి. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ అమెరికా వెళ్లి మరీ దీనికోసం ప్రయత్నించారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే మార్గాల్లోకెల్లా ఇదే అత్యుత్తమమైందని చెప్పారు. ఒప్పందం విషయంలో ఇరాన్‌ మోసానికి పాల్పడుతోందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతెన్యాహు కొన్ని పత్రాలను విడుదల చేయగా.. ఆయన వాదనను ఐరోపా దేశాలు ఖండించాయి. ఒప్పందాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఈ పత్రాలు చాటుతున్నాయని పేర్కొన్నాయి.
















Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.