Type Here to Get Search Results !

May-15

May-15 Current affairs articles

సులభ్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌కు నిక్కీ ఆసియా పురస్కారం
Event-Date:15-May-2018
Level:National
Topic:Awards and honours
సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు డా॥ బిందేశ్వర్‌ పాఠక్‌కు నిక్కీ ఆసియా పురస్కారం లభించింది. 2018 జూన్‌ 13న టోక్యోలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించనున్నారు. ఆసియా అభివృద్ధిలో పాఠక్‌ చేసిన సేవలకు ఈ అవార్డు దక్కింది. ఆయనతో పాటూ మరో ఇద్దరు కూడా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 1970లో ఆయన స్థాపించిన సులభ్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థ పారిశుధ్యం, మానవహక్కులు తదితర రంగాల్లో సామాజిక సేవను అందచేస్తోంది. దేశవ్యాప్తంగా సులభ్‌ సంస్థ మరుగుదొడ్లను నిర్మించింది. 

-------------------------------------------------------------------------------------------
ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన కాళ్లులేని షియా బోయు 
Event-Date:15-May-2018
Level:National
Topic:Persons in News
అత్యున్నత ఎవరెస్ట్‌ పర్వతంపై రికార్డుల మోత మొదలైంది. రెండు కాళ్లూలేని 69 ఏళ్ల చైనావాసి షియా బోయు ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల నాటి(తొలి ప్రయత్నం 1975లో) లక్ష్యాన్ని పూర్తిచేశారు. 1996లో రక్త క్యాన్సర్‌ వల్ల ఆయన కాళ్లను వైద్యులు తొలగించారు. అయినప్పటికీ పట్టువదలని ధైర్యంతో ఐదో ప్రయత్నంలో ఈ 8,848 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని ఆయన అధిరోహించారు.
  • అతితక్కువ రోజుల్లోనే 7 ఖండాల్లోని 7 ఎత్తైన పర్వతాలనూ అధిరోహించాలన్న 36ఏళ్ల ఆస్ట్రేలియావాసి స్టీవ్‌ ప్లెయిన్‌ కలా నిజమైంది. 117 రోజుల క్రితం అంటార్కిటికాలోని విన్సన్‌ పర్వతం నుంచి ఆయన తన యాత్ర మొదలుపెట్టారు. ఎవరెస్టుపై కాలు మోపడంతో ఆయన లక్ష్యం పూర్తయింది. ఇదివరకు ఈ 7 పర్వతాలను పోండ్‌కు చెందిన జానుష్‌ కోచాన్‌స్కీ 126 రోజుల్లో అధిరోహించారు. దీన్ని ప్లెయిన్‌ అధిగమించారు. 
2022 కల్లా అతిపెద్ద ఉభయచర విమానం : చైనా
ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానాన్ని 2022 కల్లా సిద్ధం చేయాలని చైనా నిర్ణయించింది. కున్‌లాంగ్‌ అనే ఈ విమానం నీటిపైన, నేల పైన దిగగలదు. సముద్రంలో సహాయ చర్యలు, అడవుల్లో మంటలను ఆర్పడానికి, సాగర జీవంపై పర్యవేక్షణకు దీన్ని ఉపయోగిస్తారు. ఎవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా దీన్ని రూపొందిస్తోంది.
ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ శ్రీలంక పర్యటన
Event-Date:15-May-2018
Level:National
Topic:Foreign relations
శ్రీలంకలో 4 రోజుల పర్యటనలో భాగంగా ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2018 మే 14న కొలంబోలో ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘేతో సమావేశమై సైనిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. భారత శాంతి పరిరక్షణ దళం (IPKF) తరఫున శ్రీలంకలో పోరాడి ప్రాణత్యాగం చేసినవారికి IPKF స్థూపం వద్ద రావత్‌ నివాళులర్పించారు. 
IPKF-Indian Peace Keeping Force 
ICSEలో 15 మందికి 99 శాతానికిపైగా మార్కులు 
ఇండియన్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ICSE) 10వ తరగతి పరీక్షల్లో 15 మంది విద్యార్థులు 99 శాతానికిపైగా మార్కులు సంపాదించారు. ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ 12వ తరగతిలోనూ 49 మంది విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఈ రెండు పరీక్ష ఫలితాలను కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌ (CISCE) 2018 మే 14న విడుదల చేసింది.
  • 10వ తరగతిలో ముంబయి విద్యార్థి స్వయందాస్‌ 99.4% మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. జలంధర్‌కు చెందిన జాస్మిన్‌ కౌర్‌ చాహల్‌, ముంబయికి చెందిన అంకోహి అమిత్‌ మెహ్తాలు 99.2 శాతంతో 2వ స్థానంలోనిలిచారు. మూడోస్థానాన్ని 99% మార్కులతో 25 మంది దక్కించుకున్నారు. 
ICSE-Indian School Certificate Examinations
CISCE-Council for the Indian School Certificate Examinations 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 77 సంస్థల విభజన పూర్తి 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 9వ షెడ్యూులుకు చెందిన 77 ప్రభుత్వరంగ సంస్థల్లో విభజన పూర్తయిందని, మరో 24 సంస్థల ప్రక్రియ మిగిలిపోయిందని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల భేటీని పురస్కరించుకొని రెండు ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల  విభజన ప్రక్రియపై కేంద్రం నుంచి సమాచారాన్ని కోరాయి. దీనిపై కేంద్రం 2018 మే 14న ఈ సంస్థపై షీలాభిడే కమిటీ సమర్పించిన నివేదిక వివరాలను రెండు రాష్ట్రాలకు పంపింది.
2017లో  ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్ష చాలా శక్తిమంతమైంది
ఉత్తర కొరియా చివరిసారిగా 2017లో  నిర్వహించిన అణు పరీక్ష చాలా శక్తిమంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా వేసిన అణు బాంబుకన్నా ఇది పదిరెట్లు శక్తిమంతమైందని వివరించారు. ఒక పర్వతాన్నే అది కదిలించిందన్నారు.
  • 2017 సెప్టెంబర్‌ 3న ఉత్తర కొరియా ఈ అణుపరీక్షను నిర్వహించింది. దేశ ఉత్తర భాగంలోని పుంగ్యే-రి అణు పరీక్షా స్థలిలో మాంటాప్‌ పర్వతంకింద నేలమాళిగలో ఈ పరీక్ష జరిగింది.
  • సింగపూర్‌లోని నాన్యాంగ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం, అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన సాగించారు. భూప్రకంపనలు, ఉపగ్రహాలు అందించిన వివరాల ఆధారంగా విశ్లేషణలు చేశారు. 
  • అణుపరీక్ష వల్ల 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. 
  • పేలుడుతో మాంటాప్‌ పర్వతంలో మార్పులు వచ్చాయి. పర్వతం ఉపరితలాన్ని 3.5 మీటర్ల మేర వెలుపలికి నెట్టేసింది. దీని వల్ల 0.5 మీటర్ల మేర ఎత్తు తగ్గింది. 
  • విస్ఫోటం వల్ల  50 మీటర్ల వెడల్పున్న సొరంగంలో గ్రానైట్‌ రాయి ఆవిరైపోయింది. 300 మీటర్ల ప్రదేశంలో శిల దెబ్బతింది.
  • పర్వత శిఖరాగ్రం నుంచి 400-600 మీటర్ల లోతులో అణు విస్ఫోటం జరిగినట్లు కంప్యూటర్‌ నమూనాలు తేల్చాయి. 
  • పేలుడు అనంతరం 8.5 నిమిషాలకు రెండో ప్రకంపన వచ్చింది. విస్ఫోట ప్రదేశానికి 700 మీటర్ల దూరంలో అది తలెత్తింది. మునుపటి అణు పరీక్షకు సంబంధించిన సొరంగంలో కొంతభాగం కూలడం వల్ల ఇలా జరిగింది. 
  • ఈ అణుపరీక్ష సామర్థ్యం 120 నుంచి 300 కిలో టన్నుల  మేర ఉండొచ్చు. అది చిన్నపాటి హైడ్రోజన్‌ బాంబు కానీ భారీ స్థాయి అణు బాంబు కానీ అయ్యి ఉండొచ్చు.
చంద్రబాబును కలిసిన అనిల్‌ అంబానీ 
Event-Date:15-May-2018
Level:Local
Topic:Persons in News
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ 2018 మే 14న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని బ్లూ, గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. 
డిపాజిట్లపై బీమా పరిమితిని పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రికి చంద్రబాబు లేఖ 
వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.లక్ష నుంచి రూ.15 లక్షలకు పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 మే 14న లేఖ రాశారు. డిపాజిట్టుదారుపై ఎలాంటి భారం పడకుండా దీన్ని పెంచాలని కోరారు.
  • డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) ద్వారా డిపాజిట్లపై రూ.లక్ష బీమా పరిమితిని 1993లో నిర్ణయించారు. 
DICGC-Deposit Insurance and Credit Guarantee Corporation 
కేంద్ర కేబినెట్‌లో స్వల్ప మార్పులు 
కేంద్ర కేబినెట్‌లో 2018 మే 14న స్వల్ప మార్పులు జరిగాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యత నుంచి స్మృతి ఇరానీని తప్పించారు. ఇప్పటివరకూ అదే శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్‌ రాథోడ్‌కే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు రాష్ట్రపతి ఈ మార్పుకు ఆమోద ముద్ర వేశారు. స్మృతి ఇరానీని కేవలం జౌళి శాఖకు పరిమితం చేశారు.
  • స్మృతి ఇరానీ చూస్తున్న శాఖను మార్చడం ఇది రెండోసారి. గతంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆమె ఉండేవారు. దాని నుంచి తప్పించి, సాపేక్షంగా తక్కువ ప్రాధాన్యమున్న జౌళి శాఖను అప్పగించారు. 2017 జులైలో ఎం.వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక అంతవరకు ఆయన చూస్తూవచ్చిన సమాచార-ప్రసార శాఖ బాధ్యతల్ని ఆమెకి అదనంగా ఇచ్చారు. 
  • రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతనూ తాత్కాలిక ప్రాతిపదికన అప్పగించారు. ఇప్పటివరకూ ఈ బాధ్యతలు చూస్తున్న అరుణ్‌జైట్లీకి 2018 మే 14న మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్‌ జరగడంతో ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతను తాత్కాలికంగా గోయల్‌కు అప్పగించారు.
  • ఇప్పటివరకూ తాగునీరు, పారిశుద్ధ్యశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎస్‌.ఎస్‌.అహ్లూవాలియాను ఆ బాధ్యత నుంచి తప్పించి ఎలక్ట్రానిక్‌, ఐటీ శాఖలు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండు శాఖలను పర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్‌ కన్నన్‌థానమ్‌ అదనపు బాధ్యతగా చూస్తున్నారు. ఆయన ఇకపై పర్యాటక శాఖకే పరిమితమవుతారు.
గాజా ఘర్షణల్లో 52 మంది మృతి
ఇజ్రాయెల్‌-పాలెస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. జెరూసలెంలో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో.. గాజా సరిహద్దుల్లో 2018 మే 14న నరమేధం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో 52 మంది పాలెస్తీనావాసులు మృతి చెందారు.
  • 2014 గాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌-పాలెస్తీనా మధ్య ఇంతటి విధ్వంసక ఘర్షణలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.
  • జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తూ.. అక్కడ దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2017 డిసెంబరు 6న ప్రకటించారు. ఆయన నిర్ణయంపై పాలెస్తీనాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సరిహద్దుల్లో పాలెస్తీనావాసులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
  • దౌత్య కార్యాలయం ప్రారంభవేళ సమీపించడంతో.. 2018 మే 14న ఆందోళనలు తీవ్రమయ్యాయి. వేలాదిమంది పాలెస్తీనావాసులు సరిహద్దు రేఖవైపు దూసుకొచ్చారు. టైర్లకు నిప్పంటించి సరిహద్దు దిశగా వదిలారు. మండుతున్న గాలిపటాలను ఇజ్రాయెల్‌వైపుగా పంపించారు. ఆ దేశ బలగాలపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్‌ దళాలు మొదట భాష్ఫవాయుగోళాలను ప్రయోగించాయి. అనంతరం కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 52 మంది మృతి చెందారు. 2,400 మందికిపైగా గాయపడ్డారు. 
  • ఘర్షణ మధ్యే జెరూసలెంలో తమ దౌత్య కార్యాలయాన్ని అమెరికా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, అమెరికా విదేశాంగశాఖ సహాయమంత్రి జాన్‌ సులివన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, ఆమె భర్త జరేడ్‌ కుష్నర్‌ హాజరయ్యారు.
‘కంటి వెలుగు’ పథకానికి రూ.106.83 కోట్లు మంజూరు 
రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గాను రూ.106.83 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 84.0192 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ఇచ్చే నిధులు రూ. 22.80 కోట్లుగా పేర్కొంది. కంటి వెలుగు పథకంలో భాగంగా 3.5 కోట్ల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించనున్నారు.  
తెలంగాణలో విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్‌ 
తెలంగాణలో విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్లను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల్లోని ప్రత్యక్ష నియామకాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.
  • క్రీడా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ల మాదిరిగా సమాంతరంగా అమలవుతాయి.
  • రోస్టర్‌ ప్రకారం 48, 98 పాయింట్లను దీనికి కేటాయించారు. ఈ విధానంలో ప్రతి 100 పోస్టుల భర్తీలో 48వ, 98వ పోస్టులు క్రీడాకారులకు చెందుతాయి.
  • ప్రస్తుతం పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో 2% రిజర్వేషన్లు ఉండగా, తెలంగాణ మూడో రాష్ట్రంగా దీన్ని అమలు చేయనుంది. 
  • రిజర్వేషన్లను 29 క్రీడలకు వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
రిజర్వేషన్లు వర్తించే క్రీడలు
1. ఫుట్‌బాల్‌
2. హాకీ
3. వాలీబాల్‌
4. హ్యాండ్‌బ్యాల్‌
5. బాస్కెట్‌బాల్‌
6. టెన్నిస్‌
7. టేబుల్‌ టెన్నిస్‌
8. షటిల్‌ బ్యాడ్మింటన్‌
9. కబడ్డీ
10. అథ్లెటిక్స్‌
11. ఈత
12. జిమ్నాస్టిక్స్‌
13. వెయిట్‌లిఫ్టింగ్‌
14. రెజ్లింగ్‌
15. బాక్సింగ్‌
16. సైక్లింగ్‌
17. త్రోయింగ్‌
18. షూటింగ్‌
19. ఫెన్సింగ్‌
20. రోలర్‌ స్కేటింగ్‌
21. సెయిలింగ్‌/ యాచింగ్‌
22. ఆర్చరీ
23. క్రికెట్‌
24. చెస్‌
25. ఖోఖో
26. జూడో
27. తైక్వాండో
28. సాఫ్ట్‌బాల్‌
29. బాడీ బిల్డింగ్‌
తెలంగాణ క్రీడల శాఖ మంత్రి - పద్మారావు 
తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్‌ - అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి 










Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.