Type Here to Get Search Results !

Nov-2018 Persons

నవంబరు 2
¤ దాదాపు దశాబ్ద కాలం నాటి ‘సత్యం కుంభకోణం'లో సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) సంచలన ఆదేశాలు ఇచ్చింది.
           » సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకులైన బి. రామలింగరాజును 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్‌లో కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేకుండా నిషేధించింది. దీంతో పాటు చట్ట వ్యతిరేకంగా సంపాదించిన రూ. 813.40 కోట్ల మొత్తాన్ని వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
           » బి. రామలింగరాజుతో పాటు ఆయన సోదరులు బి. రామరాజు, బి. సూర్యనారాయణ రాజు, ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. 14 ఏళ్ల నిషేధ కాలంలో ఇప్పటికే పూర్తయిన కాలం కలిసి ఉంటుంది.
¤ ‘తాలిబన్ల గాడ్‌ఫాదర్‌'గా పేరుకెక్కిన ప్రముఖ పాకిస్థానీ ఇస్లాం మత బోధకుడు మౌలానా సమీ ఉల్‌ హఖ్‌ (82) రావల్పిండిలోని స్వగృహంలో హత్యకు గురయ్యారు.
           » హఖ్‌ నడిపిన దారుల్‌ ఉలూమ్‌ హఖ్ఖానియా అనే మదర్సా ‘జీహాద్‌ విశ్వవిద్యాలయం'గా పేరుకెక్కింది. తాలిబన్‌ సహా పలు ఉగ్రసంస్థల నేతల్లో చాలా మంది ఇక్కడ శిక్షణ పొందారు.
           » గతంలో పాకిస్థాన్‌ పార్లమెంటుకు హఖ్‌ రెండు సార్లు ఎన్నికయ్యారు. దిఫా-ఎ-పాకిస్థానీ పేరుతో ఏర్పాటైన ఓ కూటమికి ఛైర్మన్‌గానూ పనిచేశారు.
           » ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు చెందిన జమాత్‌-ఉద్‌-దవా సంస్థకు కూడా ఇందులో సభ్యత్వం ఉంది.
¤ తెలుగు లిపికి సబంధించి ఐఐఐటీ హైదరాబాద్‌ పరిశోధన విద్యార్థిని శ్రీకవిత పారుపల్లి సరికొత్త ప్రయత్నం చేశారు.
           » 21,000 ప్రాచీన తెలుగు పదాలను అంతర్జాలంలో పొందుపర్చడం ద్వారా సాంకేతిక ప్రపంచంలో అవి చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కృషిచేసి పరిశోధన పత్రం సమర్పించారు.
           » 3 నెలల పాటు శ్రమించి ‘తెలుగు వర్డ్‌ నెట్‌' ద్వారా తెలుగు పదాలు పొందుపరిచారు.
నవంబరు 3
¤ భారతీయ వైద్య సంఘం (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ - ఐఎంఏ) నూతన అధ్యక్షుడిగా శంతను సేన్‌ (2018-19) ఎంపికయ్యారు.
           » 2019-20 సంవత్సరానికి తదుపరి అధ్యక్షుడిగా రాజన్‌ శర్మ ఎంపికయ్యారు.
నవంబరు 6
¤ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మాజీ నేత జునైద్‌ అజిమ్‌ మట్టు శ్రీనగర్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు.
           » ఈ ఎన్నికలో జునైద్‌ అజిమ్‌ బీజేపీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మద్దతుతో మేయర్‌ అయ్యారు.
           » జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సెప్టెంబరులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను వదిలి జునైద్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
¤ మావోయిస్టు పార్టీ తమ కేంద్ర కమిటీలో భారీ మార్పులు చేపట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ను నియమించింది.
           » కేశవరావు ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా, కేంద్ర మిలిటరీ కమిషన్‌ కార్యదర్శిగా పార్టీలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
           » తాజా మార్పుల నేపథ్యంలో ముప్పాళ్ల లక్ష్మణరావు ఇకపై పార్టీకి సలహాదారుగా, మార్గదర్శకుడిగా వ్యవహరించనున్నారు.
           » కేంద్ర మిలిటరీ కమిషన్‌ కార్యదర్శిగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవుజీకి బాధ్యతలు అప్పగించారు.
నవంబరు 7
¤ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా నూతన ఛైర్‌పర్సన్‌గా రాబిన్‌ డెన్‌హోమ్‌ (55) నియమితులయ్యారు.
           » గత కొంతకాలంగా టెస్లా బోర్డులో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రాబిన్‌ డెన్‌హోమ్‌ ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద టెలికాం కంపెనీ టెల్‌స్ట్రాకు చీఫ్‌ ఫైనాన్షియర్‌ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు
.
           » అమెరికా స్టాక్‌ మార్కెట్లలో పబ్లిక్‌ హోల్డింగ్‌ కంపెనీగా లిస్టయిన టెస్లాను ప్రైవేటు కంపెనీగా మారుస్తానని, ఇన్వెస్టర్ల షేరుకు 420 డాలర్లు చెల్లిస్తానని ఈ ఏడాది ఆగస్టు 7న టెస్లా ఛైర్మన్‌ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తూ మోసానికి పాల్పడ్డారని అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) అభిప్రాయపడింది. దీంతో మస్క్‌ అక్టోబరులో తన ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు
.
           » టయోటా, సన్‌ మైక్రో సిస్టమ్స్, జునిపర్‌ నెట్‌వర్స్క్‌లో కూడా రాబిన్‌ డెన్‌హోమ్‌ వివిధ హోదాల్లో పనిచేశారు.
నవంబరు 9
¤ అమెరికాలోని ప్రఖ్యాత జాతీయ సైన్స్‌ బోర్డు సభ్యుడిగా భారత సంతతి ఆచార్యుడు ప్రొఫెసర్‌ సురేశ్‌ వి గరిమెళ్ల నియమితులు కానున్నారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు.            » సురేశ్‌ ఇండియానాలోని పర్డూ విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆచార్యులుగా పని చేస్తున్నారు. సురేశ్‌ను ఆరేళ్ల పదవీకాలానికిగాను జాతీయ సైన్స్‌ బోర్డు సభ్యుడిగా నియమించనున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి.
నవంబరు 12
¤ చైనాకు చెందిన క్యూ జియాన్యు అనే 13 ఏళ్ల బాలుడు ఒకేసారి రెండు చేతులు, కాళ్లతో మూడు క్యూబ్‌లను ఒక్క నిమిషం 36.39 సెకన్లలో సెట్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
           » గతంలో ఇదే విన్యాసాన్ని అయిదు నిమిషాల 6.61 సెకన్లలో పూర్తి చేసిన రికార్డును తనకు తానే తిరగరాశాడు.
నవంబరు 13
¤ ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) అయిన బిన్నీ బన్సల్‌ (37) తన పదవికి రాజీనామా చేశారు.           » ఆయన పై వచ్చిన తీవ్ర వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో బిన్నీ రాజీనామా చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ మాతృ సంస్థ వాల్‌మార్ట్‌ ప్రకటించింది. ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల వల్లే ఈ పరిణామం చోటుచేసుకుంది.           » ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవోగా కళ్యాణ్‌ కృష్ణమూర్తి కొనసాగనున్నారు.
నవంబరు 14
¤ నెహ్రూ యువ కేంద్ర జాతీయ పాలక మండలి వైస్‌ ఛైర్మన్‌గా బీజేపీ నేత ఎస్‌.విష్ణువర్ధన్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.           » కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ నియామకం చేసింది. ¤ స్ప్రింటర్‌ హిమదాస్‌ యునిసెఫ్‌ ఇండియా తొలి యువ రాయబారిగా నియమితురాలైంది. ఈ విషయాన్ని యునిసెఫ్‌ ట్విటర్‌లో వెల్లడించింది.           » హిమదాస్‌ 2018 ఆసియా క్రీడల్లో 4 × 400 రిలేలో స్వర్ణం గెలిచింది.
నవంబరు 15
¤ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాత్కాలిక ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా జయేష్‌ సంఘ్‌రాజ్‌కా నియమితులయ్యారు.           » ప్రస్తుత సీఎఫ్‌ఓ ఎండీ రంగనాథ్‌ స్థానాన్ని జయేష్‌ భర్తీ చేయనున్నారు.
నవంబరు 16
¤ భారత శస్త్రచికిత్స నిపుణుల సంఘం (ఏఎస్‌ఐ) అధ్యక్షుడిగా డాక్టర్‌ పి. రఘురాం ఎన్నికయ్యారు.
           » రఘురాం ప్రస్తుతం భారత రొమ్ము శస్త్రచికిత్స నిపుణుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
           » ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో అతి పెద్ద నిపుణుల సంఘంగా, ప్రపంచంలో రెండో అతిపెద్ద సంఘంగా ఏఎస్‌ఐ గుర్తింపు పొందింది.
నవంబరు 19
¤ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వాహన దిగ్గజం నిస్సాన్‌ ఛైర్మన్‌ కార్లోస్‌ ఘోన్‌ అరెస్ట్‌ అయ్యారు. కంపెనీ సొమ్మును కార్లోస్‌ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారన్న ఆరోపణలపై గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతోంది. తాజాగా టోక్యోలో ఆయన్ను అరెస్టు చేశారు.           » సంక్షోభంలో కూరుకున్న సంస్థలను గాడిలో పెట్టడంలో కార్లోస్‌ దిట్ట. సుదీర్ఘకాలంపాటు వాహన సంస్థలకు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినవారిలో ఆయన ఒకరు. ‘కాస్ట్‌ కిల్లర్‌'గా పిలుచుకునే ఈయన నిలబెట్టిన సంస్థల్లో రెనో, నిస్సాన్‌ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం రెనో, నిస్సాన్, మిత్సుబిషి భాగస్వామ్యానికి కార్లోస్‌ నేతృత్వం వహిస్తున్నారు.
నవంబరు 21
¤ అంతర్జాతీయ పోలీసు సంస్థ ‘ఇంటర్‌పోల్‌' నూతన అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ జోంగ్‌ యాంగ్‌ ఎన్నికయ్యారు. 2020 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు.           » దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్‌పోల్‌ సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది           » ఇప్పటివరకు ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్‌ హాంగ్వే అవినీతి ఆరోపణలతో చైనాలో అరెస్టయి పదవి కోల్పోయిన నేపథ్యంలో తాజా ఎన్నిక అనివార్యమైంది.¤ అండమాన్‌లో రక్షిత ఆదిమ తెగవారిని కలుసుకోవడానికి వెళ్లిన అమెరికా జాతీయుడు జాన్‌ అలెన్‌ (27) ‘సెంటినెలీస్‌' తెగ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.           » సెంటినెలీస్‌ తెగవారు 55 వేల ఏళ్లుగా నాగరిక సమాజానికి దూరంగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు అండమాన్‌ దీవుల సమూహంలో ఉన్న ఉత్తర సెంటినెల్‌ దీవిలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు           » శాస్త్రవేత్తలు వీరిని ఆఫ్రికాలో ఆవిర్భవించిన తొలి మానవ తెగకు సంబంధించిన ప్రత్యక్ష వారసులుగా పరిగణిస్తున్నారు.¤ ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇండియా అధిపతిగా అభిజిత్‌ బోస్‌ నియమితులయ్యారు. ఈయన 2019 ప్రారంభంలో బాధ్యతలు చేపట్టనున్నారు           » ప్రస్తుతం బోస్‌ ఎలక్ట్రానిక్స్‌ పేమెంట్స్‌ సంస్థ ఇజెటాప్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.           » గురుగ్రామ్‌ కేంద్రంగా పూర్తి దేశీయ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా వెలుపల ఇదే మొదటి విభాగమని సంస్థ తెలిపింది.           » నకిలీ సందేశాలను నిరోధించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వాట్సాప్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో భారత విభాగానికి అధిపతిని నియమించారు.
నవంబరు 22
¤ అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ అగ్రానమి (ఏఎస్‌ఏ) ఏటా అందించే ఫెలోషిప్‌లో భాగంగా 2018కి ఇక్రిశాట్‌లో జెనెటిక్స్‌ గెయిన్స్‌ విభాగంలో సంచాలకుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ రాజీవ్‌ కె. వర్షణేను ఎంపిక చేశారు.
           » ఈసారి ప్రపంచ వ్యాప్తంగా 14 మందికి ఫెలోషిప్‌ను అందిస్తుండగా అందులో ముగ్గురు మినహా అంతా అమెరికన్లే. భారత్‌ నుంచి ఈ జాబితాలో రాజీవ్‌ ఒక్కరే చోటు దక్కించుకన్నారని ఇక్రిశాట్‌ ప్రకటించింది.
           » పంటల అభివృద్ధిలో భాగంగా ఆయన జీనోమిక్స్, మాలిక్యులార్‌ బ్రీడింగ్‌ అంశాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.
¤ అపోలో టైర్స్‌కు ప్రచారకర్తగా సచిన్‌ తెందుల్కర్‌ నియమితులయ్యారు. అయిదేళ్లపాటు ఆయన సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతారు.
           » అపోలో టైర్స్‌ తొలిసారిగా తమ బ్రాండ్‌కు ఓ సెలబ్రిటీని ఎంపిక చేసుకుంది.
¤ నిస్సాన్‌ ఛైర్మన్‌ కార్లోస్‌ ఘోన్‌ తొలగింపునకు బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. ఈయన ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఇటీవల అరెస్టయ్యారు. సంస్థ జరిపిన అంతర్గత విచారణలో కూడా ఇది నిజమని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.
నవంబరు 23
¤ పాకిస్థాన్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భీకర దాడులతో మారణహోమం సృష్టించారు.
           »
 కరాచీలోని చైనా కాన్సులేట్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు చనిపోయారు.           » ఖైబర్‌ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో శక్తిమంతమైన బాంబుదాడిలో 32 మంది చనిపోయారు. ఈ ప్రావిన్స్‌లోని గిరిజన ఒరక్‌జాయ్‌ జిల్లాలోని కలయా ప్రాంతంలో మైనార్టీ షియాలకు పవిత్ర ప్రదేశమైన ఇమామ్‌బర్గాకు సమీపంలో జుమా బజార్‌ (శుక్రవారం మార్కెట్‌) వద్ద శక్తిమంతమైన బాంబును పేల్చారు.¤ గూగుల్‌ తన వినూత్న ‘నైబర్లీ' యాప్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఈ యాప్‌ అత్యంత అనువైంది.           » హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి సందేహాన్ని అయినా ఈ యాప్‌ ద్వారా పోస్ట్‌ చేయవచ్చు. దానికి ఎవరో ఒకరు స్పందించి తగిన సమాచారాన్ని అందించవచ్చు.
నవంబరు 28
¤ ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు ఎడిటింగ్‌ ద్వారా శిశువులను సృష్టించిన ప్రయోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో చైనా శాస్త్రవేత్త హె జియాంక్వే వెనక్కి తగ్గారు. వివాదాస్పదమైన ఈ కసరత్తును నిలుపుదలలో ఉంచినట్లు చెప్పారు.
నవంబరు 29
¤ భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ పదవీ విరమణ చేశారు. ఈయన 1035 తీర్పులతో టాప్‌-10 సుప్రీం జడ్జీల జాబితాలో పదోస్థానం దక్కించుకున్నారు.           » జస్టిస్‌ జోసెఫ్‌ కేరళలో 1953, నవంబరు 30న జన్మించారు. 2010 ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చి వరకూ హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013 మార్చి 8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్‌ పదోన్నతి పొందారు.¤ పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన నవంబరులో ప్రచురించిన ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌లో అండర్‌-30 శాస్త్రవేత్తల విభాగంలో చోటు దక్కించుకుంది.           » 2018 మేలో నిర్వహించిన ఇంటెల్‌ ఐఎస్‌ఈఎఫ్‌ (ఇంటర్నేషనల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఫెయిర్‌) అవార్డు సాధించినందుకు మేఘనను అత్యంత ప్రతిభాశాలిగా గుర్తించారు.           » తల్లిదండ్రులతో కలిసి మేఘన అమెరికాలోని ఆర్కాన్సెస్‌ స్టేట్‌ లిటిల్‌ రాక్‌లో ఉంటోంది. 2018 మేలో ప్రపంచ స్థాయిలో ఐఎస్‌ఈఎఫ్‌ సంస్థ నిర్వహించిన సైన్స్‌ఫెయిర్‌ పోటీల్లో 75 దేశాలతో పోటీపడి ఎలక్ట్రోడ్‌ మేడ్‌ విత్‌ ప్లాటినమ్‌ అనే సైన్స్‌ సూపర్‌ కెపాసిటర్‌ ప్రయోగం ప్రదర్శన ద్వారా ఈ అవార్డు సాధించింది. దీనితోపాటు 50 వేల డాలర్ల బహుమతి పొందింది.
నవంబరు 30
¤ మిస్‌ యూనివర్స్‌ తుది పోటీల్లో పాల్గొననున్న తొలి ట్రాన్స్‌ జెండర్‌గా మిస్‌స్పెయిన్‌ ఏంజెలా పోన్సె రికార్డులకెక్కారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.