జనవరి - 2
|
¤ ‘వరల్డ్ మెమొరీ ఛాంపియన్షిప్'లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల సింగపూర్ విద్యార్థి ధ్రువ్ మనోజ్ రెండు స్వర్ణాలు గెలుచుకున్నాడు. » డిసెంబరు 20 - 22 మధ్య హాంకాంగ్లో ఈ పోటీలు జరిగాయి. ముఖాలు - పేర్లు, పదాల విభాగాల్లో 56 మందిని వెనక్కి నెట్టి ధ్రువ్ ఈ ఘనత సాధించాడు.¤ శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాల్ని, హిందూ సంస్థల సవాళ్లను ధిక్కరిస్తూ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభయ్యేళ్ల వయసులోపు మహిళలు ప్రవేశించారు. » 44 ఏళ్ల వయసున్న కనకదుర్గ, 42 ఏళ్ల వయసున్న బిందు పోలీసుల సాయంతో ఆలయంలోకి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. » కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు వృత్తిరీత్యా ఓ కళాశాలలో అధ్యాపకురాలు. సీపీఎం కార్యకర్తగా పనిచేస్తున్నారు. మల్లాపురం జిల్లాకు చెందిన కనకదుర్గ పౌరసరఫరాల విభాగం ఉద్యోగి.
|
జనవరి - 3
|
¤ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్' పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్ ప్రశంసించారు. » పథకం ప్రారంభమైన తొలి వంద రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి 3 ఉచిత వైద్యసేవలు అందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ¤ పార్లమెంటు మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ సభ్యుడిగా భాజపా లోక్సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఎంపికయ్యారు. » ఈ కమిటీలో లోక్సభ నుంచి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా భాజపా ఎంపీ కంభంపాటి హరిబాబు, బిజూ జనతాదళ్ ఎంపీ కలికేష్ నారాయణ్ సింగ్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
|
జనవరి - 5
|
¤ బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు' (ఎఫ్ఈవో)గా ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. » ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విన్నపం మేరకు అక్రమ నగదు చలామణి నిరోధక చట్ట న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. » 2018 ఆగస్టులో అమల్లోకి వచ్చిన పరారీలోని ఆర్థిక నేరగాళ్ల చట్టం - 2018 నిబంధనల కింద ఎఫ్ఈవోగా ముద్రపడిన తొలి వ్యాపారవేత్త మాల్యాయే. » ప్రస్తుతం యూకేలో ఉన్న మాల్యాను ఎఫ్ఈవోగా ప్రకటించి, ఆస్తుల్ని స్తంభింపజేసి, నూతన చట్టం కింద కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని ఈడీ కోరింది.
|
జనవరి - 8
|
¤ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్గా తొలిసారిగా ఒక మహిళ నియమితులయ్యారు. భారత్లోని కర్ణాటకకు చెందిన గీతా గోపీనాథ్ ఈ ఘనత సాధించారు. ఆమె 2019 జనవరి 8న బాధ్యతలు స్వీకరించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్గా పని చేస్తున్న గీతను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్గా నియమిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే గత అక్టోబరులో ప్రకటించారు. ¤ డిజిటల్ చెల్లింపులపై కమిటీకి అధ్యక్షుడిగా నందన్ నీలేకని నియమితులయ్యారు. డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులకు భద్రత కల్పించే అంశంపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అయిదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇతర సభ్యులు: హెచ్ఆర్ ఖాన్ (ఆర్బీఐ మాజీ గవర్నర్), కిశోర్ సాన్సీ (విజయా బ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ), అరుణ శర్మ (కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి), సంజయ్ జైన్ (చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, ఐఐఎం అహ్మదాబాద్). ¤ చైనాలో భారత రాయబారిగా విక్రమ్ మిస్రీ బాధ్యతలు స్వీకరించారు.
|
జనవరి - 9
|
¤ జమ్మూ కశ్మీర్కు చెందిన యువ ఐఏఎస్ అధికారి షా ఫజల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2009లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకర్ అయిన ఫజల్ ఆ ఘనత సాధించిన తొలి కశ్మీరీగా చరిత్ర సృష్టించారు. |
జనవరి - 10
|
¤ 2018 సంవత్సరానికి గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వయిజర్స్ సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్ ప్రకటించిన అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన సెలబ్రిటీల జాబితాలో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో నిలిచారు. 170.9 మి.డా. విలువతో రెండో ఏడాది కూడా మొదటిస్థానంలో నిలవడం విశేషం. 102.5 మి.డాలర్ల బ్రాండ్ విలువతో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే రెండో స్థానంలో ఉన్నారు.
|
జనవరి - 11
|
¤ ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తయిన శిఖరాలు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ సైనికాధికారిగా కర్నల్ రణ్వీర్ జామ్వాల్ రికార్డు సృష్టించారు. జనవరి 4న అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్పై భారత జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
|
జనవరి - 14
|
¤ నంది అవార్డు గ్రహీత, దర్శకుడు కట్టా రంగారావు హైదరాబాద్లో కన్నుమూశారు. నమస్తే అన్న, ఆఖరి క్షణం, ఉద్యమం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.¤ కేరళలోని అగస్త్యకూడం అధిరోహణకు తొలిసారిగా ధన్య సనాల్ అనే ఆర్మీ అధికారి బయలుదేరారు. 1868 మీటర్ల ఎత్తయిన ఈ కొండపైకి మహిళల ప్రవేశానికి దశాబ్దాలుగా అనుమతి లేదు. అయితే గత నవంబరులో కేరళ హైకోర్టు ఈ అనధికార నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. |
జనవరి - 15
|
¤ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, పరిశోధకుడూ అయిన మొదలి నాగభూషణశర్మ (84) గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటలోని స్వస్థలంలో మరణించారు. బళ్లారి రాఘవ ప్రిన్స్ ఆఫ్ లేయర్స్ అనే గ్రంథంతోపాటు పలు నాటకాలు రచించారు. |
జనవరి - 16
|
¤ ప్రముఖ ప్రచురణ సంస్థ ఫారిన్ పాలసీ 100 మందితో రూపొందించిన గ్లోబల్ థింకర్స్ (అంతర్జాతీయ ఆలోచనాపరులు) జాబితాలో ముకేశ్ అంబానీకి చోటు లభించింది. సాంకేతిక ఆలోచనాపరుల జాబితాలో ముకేశ్కి అగ్రస్థానం దక్కింది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డే తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. పూర్తి జాబితాను జనవరి 22న విడుదల చేస్తామని ఫారిన్ పాలసీ ప్రకటించింది.¤ గన్నవరం లలిత్ ఆదిత్య సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. లలిత్ అమెరికాలో పుట్టి పెరిగినా, తెలుగు, సంస్కృతం నేర్చుకుని చిన్న వయసులోనే అష్టావధానిగా పేరుగాంచాడు.¤ ఇంటెలిజెన్స్ విభాగంపై ఏర్పాటైన అమెరికా హౌజ్ కమిటీలో కీలక సభ్యుడిగా భారత సంతతి వ్యక్తి, ఇల్లినాయిస్కు చెందిన రాజా కృష్ణమూర్తి (45) నియమితులయ్యారు. తమిళ మూలాలున్న కుటుంబానికి చెందిన కృష్ణమూర్తి దిల్లీలో జన్మించారు. తర్వాత వీరి కుటుంబం న్యూయార్క్ వెళ్లింది.
|
జనవరి - 17
|
¤ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు ప్రధాన విభాగాలకు భారత సంతతి అమెరికన్లను ఎంపిక చేశారు. అణు విద్యుత్ విభాగ సహాయ కార్యదర్శిగా రీటా బరన్వాల్, ప్రైవసీ-సివిల్ లిబర్టీస్ ఓవర్సైట్ బోర్డు సభ్యుడిగా ఆదిత్య బంజాయ్, కోశాగార సహాయ కార్యదర్శిగా బిమల్ పటేల్ ఎంపికయ్యారు.
|
జనవరి - 18
|
¤ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ దినేష్ మాహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. మరో మూడు ఖాళీలు ఉన్నాయి. ¤ అమెరికా అధ్యక్షుడి సలహా సంఘంలో భారతీయ అమెరికన్ ప్రేమ్ పరమేశ్వరన్కు స్థానం లభించింది. ఈ సంఘంలో 12 మంది సభ్యులు ఉంటారు. ట్రంప్ సలహా సంఘంలో సభ్యుడైన భారతీయ అమెరికన్గా ఆయన రికార్డు సృష్టించారు. న్యూయార్క్కు చెందిన పరమేశ్వరన్ ఇంటర్నేషనల్స్ నార్త్ అమెరికా ఆపరేషన్స్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు.
|
జనవరి - 20
|
¤ ప్రపంచంలోనే కురు వృద్ధుడిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన జపాన్వాసి మెజాజో నొనాకా (113) మరణించారు. ఉత్తర జపాన్లోని హొక్కైదో దీవికి చెందిన మెజాజో 1905 జులై 25న జన్మించారు. గత ఏడాది 112 ఏళ్ల 259 రోజులు పూర్తి చేసుకుని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ¤ ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) డీఐజీ అపర్ణకుమార్ దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి మహిళా ఐపీఎస్గా రికార్డు సృష్టించారు. ఇప్పటికే 6 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన ఆమె ఈనెల (జనవరి) 13న ఈ ఘనత సాధించారు.
|
జనవరి - 21
|
¤ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దేశంలోని 25 మంది ఉత్తమ పార్లమెంటేరియన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫ్రేమ్ ఇండియా - ఆసియా పోస్ట్ మ్యాగజీన్ శ్రేష్ట్ సంసద్ (ఉత్తమ పార్లమెంటేరియన్) పేరుతో సర్వే నిర్వహించి, ఈ జాబితాను రూపొందించింది. పార్లమెంట్కు హాజరు, చర్చల్లో భాగస్వామ్యం, ప్రశ్నలు అడగటం, సామాజిక సేవ, ప్రజలకు అందుబాటులో ఉండటం లాంటి అంశాల ప్రాతిపదికన ఈ సర్వే జరిగింది. జనవరి 31న దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో కవిత ఈ పురస్కారాన్ని అందుకుంటారు.¤ భక్తులు నడిచే దేవుడిగా పిలుచుకునే తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి పద్మభూషణ్ శివకుమారస్వామి (111) బెంగళూరులో శివైక్యం పొందారు. ఈయన 1907 ఏప్రిల్ 1న రామనగర జిల్లా మాగడి తాలూకా వీరాపుర గ్రామంలో పటేల్ హొన్నప్ప, గౌరమ్మ దంపతులకు 13వ సంతానంగా జన్మించారు. ఈయన అసలు పేరు శివణ్ణ. తర్వాతి కాలంలో శివకుమారస్వామిగా పేరు మార్చుకున్నారు. సిద్ధగంగ మఠంలో నిత్యం 9 వేల మంది విద్యార్థులు, వందలాది మంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. ఈ మఠానికి విశిష్ట స్థానం ఉంది. 600 సంవత్సరాల కిందట స్థాపించిన ఈ మఠం బాధ్యతలను 9 దశాబ్దాల కిందట శివకుమారస్వామి స్వీకరించారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా 88 ఏళ్లుగా మఠాన్ని నిర్వహించడమే కాకుండా త్రివిధ దాసోహి, శతాయుషిగా పేరు గడించారు. ‘అన్నం - అక్షరం - ఆశయం' ఇదే త్రివిధ దాసోహ విధానం. శివకుమారస్వామికి కర్ణాటక ప్రభుత్వం 2001లో కర్ణాటక రత్న ప్రకటించింది. 2015లో కేంద్రం ఆయన్ను పద్మభూషణ్తో సత్కరించింది.¤ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సి గయానాలోని భారత హైకమిషన్లో తన పాస్పోర్టును అప్పగించడం ద్వారా దేశ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో చోక్సి, అతడి మేనల్లుడు నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. వీరిద్దరూ సుమారు రూ.13,500 కోట్ల మోసానికి పాల్పడ్డారు. చోక్సి ప్రస్తుతం ఆంటిగ్వా దేశంలో ఉన్నాడు. అతడికి 2017లో ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం లభించింది. ¤ ఆసియాలోనే అతి పెద్ద మారథాన్ టోర్నీగా పేర్కొనే ముంబయి మారథాన్ - 2019లో విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రేచల్ ఛటర్జీ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 65-69 సంవత్సరాల కేటగిరీలో పాల్గొన్న ఆమె 68 ఏళ్ల వయసులో 4 గంటల 45 నిమిషాల్లో 42.195 కిలోమీటర్ల మారథాన్ను పూర్తి చేశారు. ఆమె వరుసగా అయిదుసార్లు బంగారు పతకం గెలుచుకోవడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేచల్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
|
జనవరి - 22
|
¤ స్పెయిన్లో ఆదాయ పన్ను ఎగ్గొట్టిన కేసులో ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోకు రూ.152 కోట్ల (కోటీ 88 లక్షల యూరోలు) జరిమానా విధించారు. 23 నెలల జైలుశిక్ష బదులు ఈ మొత్తం చెల్లించడానికి రొనాల్డో అంగీకరించాడు. |
జనవరి - 25
|
¤ హేమాంగ్ వేలూర్ అనే బాలుడు యంగ్ సీఈఓ అనే కంపెనీని స్థాపించి, 14 ఏళ్లకే సీఈఓ అయ్యాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో (బిట్స్) జరిగిన టెడెక్స్ అంతర్జాతీయ సదస్సులో ‘గెట్టింగ్ యంగ్ ఇన్నోవేషన్స్' అనే అంశంపై ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సదస్సులో దేశవిదేశాలకు చెందిన 17 కంపెనీల సీఈఓలు, వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు.
|
జనవరి - 26
|
* దక్షిణార్ధ గోళంలో అత్యంత ఎత్తయిన అకాంగువా మంచు పర్వతాన్ని హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అధిరోహించారు. అర్జెంటీనాకు సమీపంలోని ఈ మంచు పర్వతం ఎత్తు 22,637 అడుగులు. ఈ పర్వతం అధిరోహించిన రెండో భారతీయుడిగా తరుణ్ రికార్డు సృష్టించారు.
|
|
|