¤ బాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ (81) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కెనడాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. »ఖాదర్ ఖాన్ 1937, అక్టోబరు 22న కాబుల్లో జన్మించారు. సివిల్ ఇంజినీర్గా కెరీర్ను ప్రారంభించిన ఆయన 1973లో రాజేష్ ఖన్నా నటించిన దాగ్ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 300 పైగా చిత్రాల్లో నటించారు. జుడ్వా, జుడాయి, సుహాగ్ తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. »తాతినేని రామారావు, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు లాంటి ప్రముఖ తెలుగు దర్శకులు హిందీలో రూపొందించిన పలు చిత్రాల్లోనూ ఖాదర్ నటించారు. » 2017లో వచ్చిన మస్తీ నహీ సస్తీ ఆయన నటించిన చివరి చిత్రం. »జవానీ దివానీతో మాటల రచయితగా మారిన ఆయన 250 చిత్రాలకు సంభాషణలు రాశారు.
జనవరి - 2
¤ సచిన్ తెందుల్కర్ కోచ్, దిగ్గజ గురువు రమాకాంత్ అచ్రేకర్ (87) ముంబయిలోని స్వగృహంలో తన పుట్టిన రోజునాడే మరణించారు. » 1932, జనవరి 2న మహారాష్ట్రలో జన్మించిన అచ్రేకర్ సచిన్, వినోద్ కాంబ్లీ, చంద్రకాంత్ పండిట్, ప్రవీణ్ ఆమ్రే, అజిత్ అగార్కర్, రమేష్ పొవార్, సమీర్ దిఘే, బల్విందర్ సింగ్ సంధు లాంటి క్రికెటర్లను తీర్చిదిద్దారు. » 1943లో క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అచ్రేకర్ 1945లో న్యూహింద్ స్పోర్ట్స్ క్లబ్కు ఆడాడు.యంగ్ మహారాష్ట్ర ఎలెవన్, ముంబయి పోర్ట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 1963లో హైదరాబాద్తో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్కప్ క్రికెట్ టోర్నీ మ్యాచ్లో ఎస్బీఐ తరఫున బరిలో దిగాడు. అచ్రేకర్ ఆడిన ఏకైక ఫస్ట్క్లాస్ మ్యాచ్ అదే. కొద్దికాలం ముంబయి సెలక్టర్గా కూడా పనిచేశాడు. అనంతరం శిక్షకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. »శివాజీ పార్కులో కామత్ మెమోరియల్ క్రికెట్ క్లబ్ను స్థాపించి వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. 11 ఏళ్ల వయసులో సచిన్ అచ్రేకర్ అకాడమీలో చేరాడు. »అచ్రేకర్ 1990లో ద్రోణాచార్య పురస్కారం, 2010లో పద్మశ్రీ పురస్కారం గెలుచుకున్నారు.
జనవరి - 25
¤ ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞాన్పీఠ్, సాహిత్య అకాడెమీ పురస్కారాల విజేత కృష్ణా సోబ్తీ అనారోగ్యం కారణంగా దిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. 1925లో జన్మించిన సోబ్తీ గతంలో పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ¤ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు అడవల్లి ఇంద్రసేనారెడ్డి (88) నల్గొండ జిల్లా తెప్పలమడుగు గ్రామంలో మరణించారు. రజాకార్ల సమయంలో ఆయన తెలంగాణ కోసం పోరాడారు.
జనవరి - 29
¤ మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) దిల్లీలో మరణించారు. కొంతకాలంగా అల్జీమర్స్తో బాధపడుతున్న ఆయనకు ఇటీవల స్వైన్ఫ్లూ సోకింది. ఫెర్నాండెజ్ 1930 జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో ముజఫర్నగర్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఆయన జనతా ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998, 1999లో వాజ్పేయీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఫెర్నాండెజ్ హయంలోనే దేశంలో 1998లో పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు.
జనవరి - 30
¤ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి కె.వి. కేశవులు (97) హైదరాబాద్లో మరణించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ఆయన చెన్నారెడ్డి హయాంలో రాష్ట్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశారు.