Type Here to Get Search Results !

Feb-2019 ఆర్థిక రంగం

ఫిబ్రవరి - 4
¤ గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు చివరి నాటికి ద్రవ్యలోటు రూ.7.01 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో ఇది 112.4 శాతం. ఏడాది కిందట ఇదే సమయంలో ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాల్లో 113.6 శాతంగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ.6.24 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని గత ఏడాది బడ్జెట్‌లో అంచనా వేశారు. ఈ ప్రకారం చూస్తే 2018 డిసెంబరు చివరినాటికే ఆ అంచనాను మించి, 12 శాతం అధికంగా ద్రవ్యలోటు నమోదైంది. పన్నుల వసూళ్లు తగ్గడం దీనికి కారణమైంది.            » 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ద్రవ్యలోటును జీడీపీలో 3.4 శాతం లేదంటే రూ.6.34 లక్షల కోట్లకు సవరించారు.            » కంప్ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ గణాంకాల ప్రకారం డిసెంబరు చివరినాటికి మొత్తం ఆదాయం రూ.10.84 లక్షల కోట్లుగా (బడ్జెట్‌ అంచనాల్లో 62.8%) నమోదైంది.¤ డిజిటల్‌ లావాదేవీల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. బ్యాంకులతోపాటు బ్యాంకేతర సంస్థల ద్వారా జరిపే డిజిటల్‌ లావాదేవీలకు వర్తించేలా 2019 జనవరి 31 నుంచి దీన్ని అమల్లోకి తెస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా ఉన్న 21 ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ అంబుడ్స్‌మెన్‌లు అందుబాటులో ఉంటారు. వీటిలో పనిచేసే జనరల్‌ మేనేజర్‌ లేదా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తారు.
ఫిబ్రవరి - 5
¤ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌జీఎస్‌టీ వసూళ్లలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఆరోస్థానంలో, ఏపీ తొమ్మిదోస్థానంలో నిలిచాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎస్‌జీఎస్‌టీ కింద రూ.4.26 లక్షల కోట్లు వసూలు కాగా అందులో తెలంగాణాకు 19,588 కోట్లు (4.58%), ఏపీకి రూ.16,989 కోట్లు (3.97%) వచ్చాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ఖజానాకు అత్యధికంగా రూ.70,792 కోట్లు వచ్చాయి. అన్ని రాష్ట్రాల ఆదాయంలో 16.58% ఈ రాష్ట్రానికే దక్కుతోంది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ (రూ.38 వేల కోట్లు), కర్ణాటక (రూ.35 వేల కోట్లు), తమిళనాడు (రూ.34 వేల కోట్లు), పశ్చిమ్‌ బంగ (రూ.22 వేల కోట్లు) ఉన్నాయి. 
ఫిబ్రవరి - 7
¤ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రేట్లను పావు శాతం తగ్గించింది. ద్రవ్యోల్బణం నియంత్రిత స్థాయిలోనే ఉన్నందున, వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
           » 
ఈ రేట్ల కోతతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 6 శాతానికి దిగివచ్చాయి. దీంతో గృహా, వాహన ఇతర రుణాలు చౌక అవుతాయి. మరోవైపు నగదు నిల్వల నిష్పత్తిలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయలేదు. 4 శాతం వద్ద దీనిని యథాతథంగానే ఉంచారు. కాగా.. 18 నెలల తర్వాత ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించడం గమనార్హం. చివరిసారి 2017 ఆగస్టు 2న పావు శాతం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6వ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ వెల్లడించారు
.
పరపతి విధాన సమీక్ష - 
ముఖ్యాంశాలు           » రెపో రేటు పావు శాతం తగ్గింపు. 6.25 శాతానికి పరిమితం.
           » రివర్స్‌ రెపో రేటు, బ్యాంకు రేటులోనూ పావు శాతం కోత. ఈ రెండు వరుసగా 6%, 6.5 శాతానికి సవరణ
.
           » నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) 4 శాతం వద్ద యథాతథం
.
           » మార్చి త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనా 2.8 శాతం. వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి అర్ధభాగంలో
 3.2- 3.4%,
           » వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7.2 శాతం కంటే ఇది ఎక్కువ
.
           » ప్రపంచ వృద్ధిపై వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం
.
           » ఇక నుంచి రూ.2 కోట్లు లేదా అంతకు మించితేనే వాటిని బల్క్‌ డిపాజిట్‌ అంటారు. ప్రస్తుతం ఇది రూ.కోటిగా ఉంది
.
           » ఆఫ్‌షోర్‌ రూపాయి మార్కెట్లపై ఒక కార్యాచరణ బృందం (టాస్క్‌ఫోర్స్‌) ఏర్పాటు

           » కార్పొరేట్‌ డెట్‌ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు తొలగింపు

           » చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం ఉండేలా పూచీకత్తు రహిత వ్యవసాయ రుణాల పరిమితి ప్రస్తుతమున్న రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంపు
ఫిబ్రవరి - 9
¤ గత సంవత్సరానికి (2018) చైనా సంస్థ హ్యూరన్‌ ఇండియా రూపొందించిన జాబితాలో భారత్‌లో అత్యంత దానశీలిగా ముకేశ్‌ అంబానీ నిలిచారు. దాతృత్వ కార్యకలాపాల కోసం ఆయన రూ.437 కోట్లు ఖర్చు చేశారు. పిరమాల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్, కుటుంబం రూ.200 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ వితరణలకు రూ.113 కోట్లు వెచ్చించారు. 2017 అక్టోబరు 1 నుంచి 2018 సెప్టెంబరు 30 మధ్య దాతృత్వ కార్యక్రమాలకు రూ.10 కోట్లకు మించి వెచ్చించిన వారితో ఈ జాబితాను రూపొందించారు. సగటున రూ.40 కోట్లతో మొత్తంగా జాబితాలోని భారతీయులు దాతృత్వ రూపంలో ఖర్చు పెట్టిన మొత్తం రూ.1560 కోట్లని హ్యూరన్‌ సంస్థ పేర్కొంది.
ఫిబ్రవరి - 17
¤ వర్తమాన ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఇప్పటి వరకు సమకూరిన మొత్తం రూ.53,558 కోట్లకు చేరింది.
ఫిబ్రవరి - 18
¤ ప్రభుత్వానికి రూ.28,000 కోట్లు మధ్యంతర డివిడెండ్‌గా చెల్లించడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 18న జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2018 డిసెంబరు 31తో ముగిసిన అర్ధ సంవత్సరానికి ఈ డివిడెండ్‌ మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేయనున్నారు. ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరం జులైతో ప్రారంభమై, జూన్‌తో ముగుస్తుంది. ఆర్‌బీఐ మధ్యంతర డివిడెండ్‌ చెల్లించడం ఇది వరుసగా రెండో ఏడాది. ¤ వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20) అమెరికా నుంచి 30 లక్షల టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 150 కోట్ల డాలర్ల వరకూ ఉండొచ్చని అంచనా.
ఫిబ్రవరి - 20
¤ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు నెలల మధ్య కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 7 శాతం తగ్గి, రూ.3349 కోట్ల డాలర్లకు పడిపోయాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఇదే కాలంలో 3594 కోట్ల విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి.¤ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోని టాప్‌ ఎంప్లాయర్‌గా గుర్తింపు పొందింది. టాప్‌ ఎంప్లాయర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కంపెనీకి ఈ సర్టిఫికెట్‌ లభించింది. టీసీఎస్‌ ప్రపంచవ్యాప్త కార్యాలయాల్లో 4.17 లక్షల మంది పని చేస్తున్నారు.
ఫిబ్రవరి - 26
¤ రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తొలిసారిగా ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల తొలి 10 మందిలో స్థానం పొందారు. ‘ద హ్యూరన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2019' అంతర్జాతీయ కుబేరుల జాబితాలో ముకేశ్‌ 54 బిలియన్‌ డాలర్ల (రూ.3.83 లక్షల కోట్లు) నికర సంపదతో ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
హ్యూరన్‌ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు
           » అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ (147 బి. డాలర్లు) వరుసగా రెండో ఏడాదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగారు. బిల్‌గేట్స్‌ (96 బి. డాలర్లు), వారెన్‌ బఫెట్‌ (88 బి. డాలర్లు), బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (86 బి. డాలర్లు), జుకర్‌బర్గ్‌ (80 బి. డాలర్లు) రెండు, మూడు, నాలుగు, అయిదో స్థానాల్లో నిలిచారు.
           » భారతీయ కుబేరుల్లో ముకేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నవారు: హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎస్‌.పి. హిందుజా (21 బి. డాలర్లు), విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ (17 బి. డాలర్లు)
           » పూనావాలా ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా 13 బి. డాలర్లతో భారత కుబేరుల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. లక్ష్మీ మిత్తల్, ఉదయ్‌ కోటక్, గౌతమ్‌ అదానీ, దిలీప్‌ సంఘ్విలు అయిదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.
           » 2012 తర్వాత హూరన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో భారత్‌ అయిదో స్థానానికి పరిమితం కావడం ఇదే తొలిసారి. బలహీన రూపాయి, స్టాక్‌ మార్కెట్ల మందగమనం వల్ల జాబితాలో మూడో వంతును కోల్పోయింది.
           » ఈ ఏడాది జాబితాలో మొత్తం కుబేరుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 2,694 నుంచి 2,470కు తగ్గింది.
           » ఈ 2,470 మంది కుబేరుల మొత్తం సంపద 9.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ జీడీపీలో ఇది 12 శాతానికి సమానం.
ఫిబ్రవరి - 27
¤ మార్కెట్‌ క్షీణత, డాలర్‌ ప్రభావం వల్ల గత ఏడాది ప్రపంచ కుబేరులు లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.70 లక్షల కోట్లు) సంపదను కోల్పోయారని హ్యూరన్‌ నివేదిక వెల్లడించింది. సంపన్నుల సంఖ్యపరంగా చైనా 658 మందితో మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా (584), జర్మనీ (117) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఫిబ్రవరి - 28
¤ అక్టోబరు-డిసెంబరులో భారత జీడీపీ (స్థూలదేశీయోత్పత్తి) వృద్ధి 6.6 శాతానికి పరిమితమైంది. గత అయిదు త్రైమాసికాల్లోనే ఇది కనిష్ఠ స్థాయి. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.7 శాతంగా (2011-12 స్థిర ధరల వద్ద) నమోదైంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.